నాపై ఒక్క మాట మాట్లాడినా.. అరవింద్ కేజ్రీవాల్ కు హిమంత బిశ్వ శర్మ వార్నింగ్..
Dispur: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెచ్చరికలు చేశారు. తనపై ఒక్క అవినీతి కేసు కూడా లేదని పేర్కొంటూ.. అసోం పర్యటనలో కేజ్రీవాల్ తనపై ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తే దావా వేస్తానంటూ శర్మ హెచ్చరించారు.
Assam chief minister Himanta Biswa Sarma: అసోంలో ఆమ్ ఆద్మీ పార్టీ మెగా పొలిటికల్ ర్యాలీని నిర్వహించనుంది. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడిన విషయాలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శర్మపై ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీలో దాక్కుని పచ్చి అబద్ధాలు చెబుతున్న పిరికివాడు అరవింద్ కేజ్రీవాల్ అని హిమంత బిశ్వ శర్మ విమర్శించారు.
అసెంబ్లీ ప్రాంగణం వెలుపల తనపై అవినీతి కేసు పెండింగ్ లో ఉందని, తన సహచరుడు మనీష్ సిసోడియాతో చేసిన విధంగానే ఆయనపై కేసు పెడతానని శర్మ గౌహతిలో విలేకరులతో అన్నారు. ఏ కోర్టుల్లోనూ, దర్యాప్తు సంస్థల వద్ద, పోలీసు స్టేషన్లలో తనపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. ఇదివరకు తనపై చేసిన అవినీతి ఆరోపణల క్రమంలో కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేయగానికి సిద్ధమైన విషయాన్ని పేర్కొన్నారు. మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అలాంటి ఆరోపణలు చేస్తే ఈ సారి తప్పకుండా పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.
కాగా, కేజ్రీవాల్ ఏప్రిల్ 2న అస్సాంలో జరిగే తొలి రాజకీయ ర్యాలీలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి పాల్గొననున్నారు.