Lucknow: ఓ ఇంట్లో ఛార్జింగ్ చేస్తుండగా ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్కూటర్ తో పాటు లక్షల విలువ చేసే వస్తువులు కూడా అగ్నికి ఆహుతవగా, నలుగురు సభ్యుల కుటుంబం ప్రాణాలతో బయటపడ్డారు.
battery scooter explodes: ఇటీవలి కాలంలో ఈవీ బ్యాటరీలు పేలుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండంతో ప్రజలను ఆందోళన వ్యక్తమవుంతోంది. ఈ క్రమంలోనే ఛార్జింగ్ సమయంలో ఈవీ స్కూటర్ బ్యాటరీ బ్లాస్ట్ కావడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడి, ఇల్లు కాలిపోయి బూడిదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ లక్షల విలువైన వస్తువులు బూడిదకావడంతో ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. లక్నోలోని చౌక్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఛార్జింగ్ చేస్తుండగా ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైందని పోలీసు అధికారులు తెలిపారు. స్కూటీతో పాటు లక్షల విలువ చేసే వస్తువులు కూడా అగ్నికి ఆహుతవగా, నలుగురు సభ్యుల కుటుంబం ప్రాణాలతో బయటపడ్డారు. ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్ నిగమ్ రోడ్ కు చెందిన మహ్మద్ నసీమ్ ఇంట్లో ఈ ఘటన జరిగిందని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పుష్పేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలను పంపించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
పేలిన స్కూటర్ చైనీస్ అనీ, ఏడాదిన్నర క్రితం రూ.65 వేలకు కొనుగోలు చేశానని మహ్మద్ నసీమ్ తెలిపాడు. ''భారీ శబ్దం వినిపించినప్పటికీ పేలుడు సంభవించిందా లేక కాలిపోయిందా అనేది తెలియడం లేదు. నేను స్కూటీని మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టాను. కానీ కొన్ని గంటల తర్వాత నేను మెట్లు దిగి వచ్చేసరికి పొగ, మంటలు కనిపించాయి. దీంతో వెంటనే ఇరుగుపొరుగు వారి సాయం తీసుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చాను'' అని తెలిపారు.
'నేను ఎప్పుడూ బ్యాటరీ స్కూటర్ వాడతాను. నేను బ్యాటరీ స్కూటర్లకు మారి 15 ఏళ్లు అయింది. గతంలో స్కూటర్లు ఇండియన్ బ్రాండ్లకు చెందినవిగా ఉండేవి. కానీ ఈసారి నేను ఈ చైనీస్ స్కూటీని కొనుగోలు చేశాను, ఇది కేవలం ఒక సంవత్సరం బ్యాటరీ వారంటీని కలిగి ఉంది" అని ఆయన చెప్పారు. స్కూటీ ఛార్జర్ ఓవర్ హీట్ కావడం వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. "ఈ బ్యాటరీ స్కూటర్ల ఛార్జింగ్ కేబుల్ తరచుగా వేడెక్కుతుంది. ఈసారి కూడా అలాగే జరిగి ఉండొచ్చని'' అన్నారు.
