మనస్పర్థలతో విడిపోయిన భార్యాభర్తలు పరస్పరం కేసులు పెట్టుకొన్నారు.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67 కేసులు పెట్టుకొన్నారు. ఈ కేసులను చూసిన సుప్రీం కోర్టు  షాకైంది


బెంగుళూరు: మనస్పర్థలతో విడిపోయిన భార్యాభర్తలు పరస్పరం కేసులు పెట్టుకొన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67 కేసులు పెట్టుకొన్నారు. ఈ కేసులను చూసిన సుప్రీం కోర్టు షాకైంది. భవిష్యత్తులో ఇక ఎలాంటి కేసులు పెట్టకుండా ఆంక్షలు విధించింది.

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు 2002లో అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2009లో వీరికి బాబు పుట్టాడు.ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో భార్య అమెరికా నుండి వచ్చి బెంగుళూరులోని తన పుట్టింట్లోనే ఉంటుంది.

ఇక అప్పటి నుండి భార్యాభర్తలు పరస్పరం కేసులు పెట్టుకొన్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యపై 58 కేసులు పెట్టాడు. భార్య కూడ భర్తపై 9 కేసులు పెట్టింది. తాజాగా ఈ కేసుల విషయమై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పెండింగ్‌లో ఉన్న కేసులు పూర్తయ్యేదాకా భార్యాభర్తలు గానీ... వారి కుటుంబసభ్యులు గానీ ఎలాంటి కొత్త కేసులు పెట్టకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాదు మరో ఆరు నెలల్లోపు పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని బెంగళూరు న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది.