జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. నవంబర్ 3వ తేదీన రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో తమ ముంద విచారణకు హాజరుకావాలని ఈడీ తెలిపింది. 

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను నవంబర్ 3వ తేదీన విచారణకు పిలిచినట్టుగా ఈడీ అధికారులు బుధవారం తెలిపారు. గురువారం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో తమ ముంద విచారణకు హాజరుకావాలని కోరారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించి.. ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని ఈడీ భావిస్తున్నట్టుగా చెప్పారు. 

ఇక, ఈ కేసులో హేమంత్ సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ గతంలో అరెస్టు చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించిన నేరాల ఆదాయాన్ని గుర్తించినట్లు ఈడీ తెలిపింది. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, బర్హైత్, రాజ్‌మహల్, మీర్జా చౌకీ, బర్హర్వాలోని 19 ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, దోపిడీకి సంబంధించిన కేసులతో సంబంధం ఉన్న కేసులో జూలై 8న పంకజ్ మిశ్రా, అతని సహచరులపై ఈడీ దాడి చేసింది. ఆ తర్వాత ఈ కేసులో ఈడీ దర్యాప్తును ప్రారంభించింది.