జమ్ముకాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. లారో-పరిగామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జమ్ముకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. లారో-పరిగామ్ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆగస్టు 20వ తేదీ ఆదివారం రాత్రి ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది సంఖ్యపై ఇంకా సమాచారం లేదు. ‘‘పుల్వామాలోని లారో పరిగామ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
గత రెండు వారాల్లో పుల్వామా జిల్లాలో జరిగిన రెండో ఎన్ కౌంటర్ ఇది. ఆగస్టు 5వ తేదీన రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాగా.. జమ్మూకాశ్మీర్ లోని అత్యంత ఉద్రిక్త ప్రాంతాల్లో పుల్వామా జిల్లా ఒకటిగా ఉంది. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. 1989లో సాయుధ తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి కశ్మీర్ లో జరిగిన అత్యంత భయంకరమైన దాడి ఇది. దీంతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.