ఎన్నికల ఫలితాల సమయంలో నెలకొనే గందరగోళాన్ని తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.  అదేమిటంటే...

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ స్థానాలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్దమయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. అయితే గత ఎన్నికల అనుభవాల ద‌ృష్ట్యా ఈసారి ఎన్నికల నిర్వహణ, కౌటింగ్, ఫలితాల ప్రకటనపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఈసిఐ వెల్లడించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 ఈసికి పోలింగ్ నిర్వహణ ఓ ఎత్తయితే... ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మరో ఎత్తు. ముఖ్యంగా ఫలితాల వెల్లడికి ఈసి వద్ద ఎలాంటి వ్యవస్థ లేదు... దీంతో కౌటింగ్ సెంటర్ల వద్ద అందించే సమాచారమే మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరుతుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కో సమాచారం అందడంతో ఎవరు చెప్పేది నిజమో తెలియక ప్రజలు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. రిజల్ట్ రోజు ఏర్పడే ఈ గందరగోళాన్ని తొలగించేందుకు ఈసి సరికొత్త ప్రయోగం చేస్తోంది.

 ఎన్నికల ఫలితాల కోసం ఓ వెబ్ సైట్ తో పాటు ట్రెండ్స్ టివిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈసి ప్రకటించింది. కౌంటింగ్ సమయంలో రౌండ్ టు రౌండ్ సమాచారాన్ని ఈ ట్రెండ్స్ టివిలో ప్రసారం చేయనున్నారు. రిటర్నింగ్ అధికారులే ఈ సమాచారాన్ని అందించనున్నారు కాబట్టి ఎలాంటి గందరగోళం వుండదని ఈసి చెబుతోంది. కౌంటింగ్ కేంద్రాల బయట భారీ స్క్రీన్ పై వివరాలను ప్రసారం చేయనున్నట్లు ఎన్నికల కమీషనర్ తెలిపారు. 

Also Read Lok Sabha Election Schedule 2024 : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఇదే...

ఇక https://results.eci.gov.in/ వెబ్ సైట్ లో కూడా ఎప్పటికప్పుడు కౌంటింగ్ సమాచారాన్ని పొందుపర్చనున్నట్లు ఈసిఐ తెలిపింది. అలాగే మొబైల్ యాప్ 'VHA' ద్వారా కూడా ఖచ్చితమైన ఎన్నికల సమాచారాన్ని పొందవచ్చని ఈసి తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో గందరగోళాన్ని తొలగించడానికి ఈ ఏర్పాట్లు చేసినట్లు ఈసి తెలిపింది.