మమతా బెనర్జీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. 1న విచారణకు హాజరవ్వాలని ఆదేశం
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరాలను సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో వచ్చే నెల 1వ తేదీన విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.
కోల్కతా: కేంద్ర ప్రభుత్వంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢీ అంటే ఢీ అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ, టీఎంసీకి మధ్య పచ్చగడ్డి వేస్తే అంటుకునే స్థాయిలో చీలిపోయాయి. ఎన్నికలకు ముందు పలుకేసుల్లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్, ఆయన భార్య రుజిరాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ కేసులు నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు రోజుల వ్యవధి ముందే అభిషేక్ బెనర్జీ రుజిరాను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.
తాజాగా, అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరాలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 1వ తేదీని మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు ముందు సీబీఐ ప్రభుత్వ బొగ్గు గనులకు సంబంచిన మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇందులో అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా పేర్లనూ పేర్కొంది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారం చేసుకునే తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది.
వీరితోపాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకూ ఈడీ తాజాగా సమన్లు పంపింది. ఐపీఎస్ అధికారులు శ్యాం సింగ్ వచ్చే నెల 8న, మరో అధికారి గ్యాన్వంత్ సింగ్ వచ్చే నెల 9న హాజరవ్వాలని ఆదేశించింది.