Sanjay Raut: సంజయ్ రౌత్కు మరోమారు ఈడీ సమన్లు
Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మరోమారు సమన్లు జారీ చేసింది. జులై 1న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆయనను ఈడీ అధికారులు ఆదేశించారు.
Sanjay Raut: శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మరోమారు సమన్లు జారీ చేసింది. జులై 1న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆయనను ఈడీ అధికారులు ఆదేశించారు. సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. అయితే.. తనకు ముందస్తుగా ఖరారైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున మంగళవారం నాటి విచారణకు హాజరు కాలేనని రౌత్ సోమవారమే ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రౌత్ వినతికి సానుకూలంగానే స్పందించిన ఈడీ అధికారులు జులై 1న తమ ముందు విచారణకు హాజరు కావాలని తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.
అంతకుముందు, రూ.1,034 కోట్ల విలువైన పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఏప్రిల్ నెలలో జప్తు చేసింది.
ఈ స్కామ్ కేసులో ఆర్థిక దర్యాప్తు సంస్థ గతంలో ప్రవీణ్ రౌత్ను అరెస్టు చేసింది. సంజయ్ రౌత్ ఇతర సన్నిహితుడు సుజిత్ పాట్కర్ నివాసాలను సోదా చేసింది. విచారణలో అక్రమంగా వచ్చిన ఆదాయం ద్వారా ఆస్తుల కొనుగోలు చేసినట్టు ED గుర్తించింది.
ఇదిలా ఉంటే రౌత్కు సమన్లు జారీ చేయడంపై శివసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కుట్రలో భాగంగానే సంజయ్ కు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు.
పత్ర చావల్ స్కామ్
మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురు ఆశిష్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, రాకేష్ కుమార్ వాధ్వన్, సారంగ్ కుమార్ వాధ్వన్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. PMLA, 2002 నిబంధనల ప్రకారం ED దర్యాప్తు ప్రారంభించింది. 672 మంది అద్దెదారుల పునరావాసం కోసం పత్రా చాల్ ప్రాజెక్ట్ అభివృద్ధిని గురు ఆశిష్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించినట్లు విచారణలో వెల్లడైంది.
ఆ సమయంలో, రాకేష్ కుమార్ వాధావన్, సారంగ్ వాధ్వన్, ప్రవీణ్ రౌత్ లు ఆ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. సొసైటీ, MHADA మధ్య త్రైపాక్షిక ఒప్పందం సంతకం చేయబడింది. ఒప్పందం ప్రకారం, డెవలపర్ 672 మంది అద్దెదారులకు ఫ్లాట్లను అందించాలి. MHADA కోసం ఫ్లాట్లను అభివృద్ధి చేయాలి, ఆ తర్వాత మిగిలిన స్థలాన్ని విక్రయించాలి.
సంస్థ యొక్క డైరెక్టర్లు MHADAని తప్పుదారి పట్టించారు. FSIని తొమ్మిది మంది డెవలపర్లకు విక్రయించగలిగారు. అద్దెదారులకు పునరావాసాలను నిర్మించకుండా దాదాపు రూ. 901.79 కోట్లను సేకరించారు.
ఆపై.. గురు ఆశిష్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్.. మెడోస్ అనే ఒక ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించింది. ఫ్లాట్ కొనుగోలుదారుల నుండి బుకింగ్ మొత్తంగా రూ. 138 కోట్లు తీసుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా సదరు సంస్థ డైరెక్టర్లు సృష్టించిన నేరాల మొత్తం ఆదాయం దాదాపు రూ. 1039.79 కోట్లు. నేరం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగం సన్నిహితులకు బదిలీ చేయబడింది.
ఈ క్రమంలో హెచ్డిఐఎల్ నుండి ప్రవీణ్ రౌత్ ఖాతాకు దాదాపు రూ.100 కోట్లు బదిలీ అయినట్లు మనీ ట్రయల్ విచారణలో తేలింది. ఈ మొత్తాన్ని ప్రవీణ్ రౌత్ తన సన్నిహితులు, కుటుంబ సభ్యులు మరియు అతని వ్యాపార సంస్థలకు చెందిన వివిధ ఖాతాలకు మళ్లించాడు.
ఈ మొత్తంలో రూ. 83 లక్షలు సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, ప్రవీణ్ రౌత్ భార్య మాధురి నుండి ప్రత్యక్షంగా/పరోక్షంగా పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మొత్తాన్ని వర్షా రౌత్ దాదర్లో ఫ్లాట్ కొనుగోలు కోసం వినియోగించింది. ఈడీ విచారణ ప్రారంభించిన తర్వాత.. వర్ష రౌత్, మాధురి ద్వారా రూ.55 లక్షలను బదిలీ చేసినట్లు కూడా వెల్లడైంది. వివిధ ఇతర లావాదేవీలు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా, అలీబాగ్లోని కిహిమ్ బీచ్లోని ఎనిమిది ప్లాట్లను వర్షా రౌత్, సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్ భార్య స్వప్న పాట్కర్ పేరు మీద కూడా కొనుగోలు చేశారు. ఈ భూ డీల్లో నమోదైన విలువే కాకుండా విక్రయదారులకు నగదు చెల్లింపులు జరిగాయి.ప్రవీణ్ రౌత్, అతని సహచరుల ఈ ఆస్తులన్నింటినీ అటాచ్ చేస్తూ తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేయబడింది. ఇంతకుముందు.. PMC బ్యాంక్ మోసం కేసులో ప్రవీణ్ రౌత్ యొక్క రూ. 72.65 కోట్ల స్థిరాస్తులను డిసెంబర్ 31, 2020న ED అటాచ్ చేసింది.