ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనకు మూడోసారి సమన్లు జారీ చేశారు

ఎన్సీపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనకు మూడోసారి సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఆయనపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించేందుకు గతవారం అధికారులు రెండుసార్లు సమన్లు జారీ చేశారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్ధితుల దృష్ట్యా తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాంగ్మూలం ఇస్తానని దేశ్‌ముఖ్‌ ఈడీని కోరారు. ఇందుకు అంగీకరించని ఎన్‌ఫోర్స్‌మెంట్ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. జులై 5న దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Also Read:అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సుప్రీంలో చుక్కెదురు: సీబీఐ దర్యాప్తు అవసరమే

కాగా, బార్‌ యజమానుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని హోంమంత్రిగా వున్న సమయంలో అనిల్ దేశ్‌ముఖ్‌.. పోలీసులకు టార్గెట్లు పెట్టారని ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేకు లేఖ కూడా రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

పరమ్‌బీర్‌ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఇటీవల బాంబే హైకోర్టు... సీబీఐని ఆదేశించింది. దీంతో అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ.. దేశ్‌ముఖ్‌పై అక్రమ నగదు చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగానే ముంబయిలోని ఆయన ఇల్లు, కార్యాలయాలతో పాటు.. నాగ్‌పుర్‌లోని అనిల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సిబ్బందిని అరెస్టు చేసి విచారించింది.