ప్రముఖ ఆర్థిక వేత్త సేన్ కన్నుమూత.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంస్కరణల్లో కీలకం..
ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిపుణుడు అభిజిత్ సేన్(72) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారని సేన్ సోదరుడు డాక్టర్ ప్రణవ్ సేన్ చెప్పారు. అభిజిత్ సేన్ నాలుగు దశాబ్దాల పాటు ఆర్థికవేత్తగా దేశానికి సేవలందించారు.
ఆయన న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు, కమిషన్ ఆఫ్ అగ్రకల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఛైర్మన్ తో పాటు అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను చేపట్టారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన 2004 నుండి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యునిగా వ్యవహరించారు. వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్కు కూడా ఆయన చైర్మన్గా ఉన్నారు. భారత ప్రభుత్వం ఆయనను 2010లో పద్మభూషణ్ తో సత్కరించింది.
దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆయనకు ఎంతో పట్టుంది. అభిజిత్ సేన్ మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈసందర్భంగా ఆర్థిక రంగంలో అభిజిత్ సేన్ కృషిని పలువురు కొనియాడారు అభిజిత్ సింగ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందే ముందు న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు.
భారతీయ వ్యవసాయం గురించి ప్రాథమిక అంతర్దృష్టిని కలిగిన ఆర్థికవేత్తల్లో ఆయన ఒకరు. సేన్ గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని అతని సోదరుడు ప్రణబ్ తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతిన్నదని తెలిపారు. అతనికి భార్య జయతి ఘోష్ (ప్రఖ్యాత ఆర్థికవేత్త), ఒక కుమార్తె జాన్వి ఉన్నారు.