ప్రచార వ్యయాన్ని పదివేల నుండి రెండు వేలకు తగ్గించాలి.. కేంద్రానికి ఎన్నికల సంఘం ప్రతిపాదన
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి తమ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రచారానికి సంబంధించిన ఖర్చుల కోసం నగదు రూపంలో చెల్లించే మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ.10,000 నుండి రూ.2,000కి తగ్గించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలను సవరించాలని ఎన్నికల సంఘం ప్యానెల్ సిఫారసు చేసింది.
ఎన్నికల్లో మరింత పారదర్శకత, నగదు లావాదేవీలను తనిఖీ చేసేందుకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో అభ్యర్థుల నగదు వ్యయాన్ని తగ్గించాలని భావిస్తోంది. గతంలో ఈ పరిమితి పదివేల రూపాయలుండగా.. దానిని రెండు వేలకు తగ్గించాలని భావిస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
వివరాల్లోకెళ్తే.. ప్రచారానికి సంబంధించిన ఖర్చుల కోసం నగదు రూపంలో చెల్లించే మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ.10,000 నుండి రూ.2,000కి తగ్గించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలను సవరించాలని ఎన్నికల సంఘం ప్యానెల్ సిఫారసు చేసింది. ఇవి కాకుండా ఇతర చెల్లింపులను చెక్కు లేదా డిజిటల్ రూపంలో చెల్లించాలని సిఫారసు చేసింది.
ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రూ. 10,000 పైబడిన చెల్లింపులన్నీ ఎన్నికల సమయంలో చెక్కులు, డ్రాఫ్ట్లు లేదా బ్యాంకు బదిలీల ద్వారానే జరుగుతాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందుగా ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఎన్నికల ఫలితాల ప్రకటన నుండి 30 రోజులలోపు అభ్యర్థి ఎన్నికల వ్యయ ఖాతాను జిల్లా ఎన్నికల అధికారి (DEO)కి సమర్పించాలి.
మరో వైపు.. గుజరాత్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల ఖాతాల్లో రూ.10 లక్షలకు పైగా అనుమానాస్పద లావాదేవీలపై నిఘా ఉంచాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. లక్ష రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపిన అభ్యర్థుల ఖాతాలను తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రచార సమయంలో అభ్యర్థులు రూ. 40 లక్షలకు మించి ఖర్చు చేయరాదని, అందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని రాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రూ.10,000 కంటే ఎక్కువ లావాదేవీలన్నీ చెక్కు, ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) లేదా డ్రాఫ్ట్ ద్వారానే జరగాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లోని వ్యయ మానిటరింగ్ సెల్ల నోడల్ అధికారులు బ్యాంక్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. సీఈవో కార్యాలయం నుంచి లేఖ అందడంతో మెహసానా జిల్లా అభివృద్ధి అధికారి ఓం ప్రకాశ్ శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకులకు అవసరమైన సూచనలు చేశారు. ప్రకాష్ను అక్కడ నోడల్ అధికారిగా నియమించారు.
ఈ సందర్బంగా మెహసానా జిల్లా అభివృద్ధి అధికారి ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు అన్ని లావాదేవీలపై నిఘా ఉంచాలని, రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అనుమానాస్పద లావాదేవీలను నివేదించాలని తాము బ్యాంకులను కోరాము అని ప్రకాష్ చెప్పారు.
ఇది అన్ని బ్యాంకు ఖాతాలకు వర్తిస్తుందనీ, అభ్యర్థులు ఖాతాలను తక్షణమే తెరవాలని, రూ. 1 లక్షకు పైబడిన అన్ని లావాదేవీలను నివేదించాలని తాము అన్ని బ్యాంకులను ఆదేశించామనీ,ఈ నిబంధన అభ్యర్థి జీవిత భాగస్వామి( భార్య లేదా భర్త) కు వర్తిస్తోందని తెలిపారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.