ఎన్నికల ఖర్చుల్లో బీజేపీ టాప్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఎంత ఖర్ఛు చేసిందంటే.. ?
EC filings: ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీలు భారీగానే ఖర్చు చేశాయి. ఎన్నికల సంఘం పబ్లిక్ డొమైన్లో ఖర్చుల వివరాల జాబితా ప్రకారం.. బీజేపీ టాప్ లో ఉంది.
Election Commission filings: ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. గతంలో పోలిస్తే ఎన్నికల ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయని ఎన్నికల సంఘం రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీలు భారీగానే ఖర్చు చేశాయి. ఎన్నికల సంఘం పబ్లిక్ డొమైన్లో ఖర్చుల వివరాల జాబితా ప్రకారం.. బీజేపీ టాప్ లో ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం దాని ప్రచారానికి ₹340 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఎక్కువ ఖర్చు ఉత్తరప్రదేశ్లో జరిగిందని పార్టీ ఎన్నికల వ్యయ నివేదిక తెలిపింది.
ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ తర్వాత అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది. కాంగ్రెస్ ఐదు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ₹194 కోట్లు ఖర్చు చేసిందని, ఎన్నికల కమిషన్ (EC)కి సమర్పించిన దాని స్వంత వ్యయ నివేదిక పేర్కొంది. రెండు పార్టీల ఎన్నికల వ్యయ నివేదికలను ఈసీ మంగళవారం రాత్రి ప్రచురించింది. ఆగస్టు 20న పార్టీ దాఖలు చేసిన బీజేపీ ఖర్చుల నివేదికలో యూపీలో ₹221.31 కోట్లు, మణిపూర్లో ₹23.51 కోట్లు , ఉత్తరాఖండ్లో ₹43.67 కోట్లు, పంజాబ్లో ₹36.69 కోట్లు, గోవాలో ₹19.06 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. సాధారణ పార్టీ ప్రచారం, అభ్యర్థులకు నిధులు ఇందులో ఉన్నాయి. మొత్తంగా, వర్చువల్ ప్రచారం కోసం బీజేపీ ₹11.97 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వర్చువల్ సమావేశాల ఖర్చులు రాజకీయ పార్టీలు పెంచాయి.
ఇదిలా ఉండగా, జూలై 11న దాఖలు చేసిన ఎన్నికల వ్యయ నివేదికలో కాంగ్రెస్ మొత్తం ₹194.80 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. ఇందులో ₹102.65 కోట్లు సాధారణ పార్టీ ప్రచారానికి, ₹90.23 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు అందించబడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో సోషల్ మీడియా మొదలైన వాటిని ఉపయోగించి వర్చువల్ ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ ₹15.67 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చిలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరిలో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ₹54 లక్షల నుంచి ₹75 లక్షలకు, లోక్సభ అభ్యర్థులకు ₹70 లక్షల నుంచి ₹95 లక్షలకు, రాష్ట్రాన్ని బట్టి ₹20 లక్షల నుంచి ₹28 లక్షలకు పెంచింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు ₹28 లక్షల నుండి ₹40 లక్షలుకు పెంచింది.
కాగా, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రకటన తేదీ నుండి ఎన్నికలు ముగిసే వరకు నగదు, చెక్కు లేదా డ్రాఫ్ట్ లేదా వస్తు రూపంలో సేకరించిన అన్ని నిధులకు సంబంధించిన ఖాతాను నిర్వహించాలి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 75 రోజుల్లోగా, లోక్సభ ఎన్నికలు జరిగిన 90 రోజుల్లోగా వారు తమ ఎన్నికల వ్యయ ప్రకటనలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది.