ఢిల్లీని వణికించిన భూకంపం.. జమ్మూకాశ్మీర్, పంజాబ్, హార్యానాల్లోనూ ప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైంది. ఢిల్లీతో పాటు జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాలో ప్రకంపనలు వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం రాత్రి 7.55 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైంది. ఢిల్లీతో పాటు జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని సామాన్లు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్తాన్లో భూకంప కేంద్రం వున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే... కొత్త సంవత్సరం తొలి రోజైన ఆదివారం అర్థరాత్రి ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం ఇవ్వలేదు.
హర్యానాలో భూకంపం
హర్యానాలోని ఝజ్జర్లో 3.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అర్థరాత్రి 1:19 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దిగువన నమోదయ్యానట్టు సమాచారం. దీని కారణంగా చాలా మంది ఈ భూకంపం ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. రోహ్తక్-ఝజ్జర్ గుండా వెళుతున్న మహేంద్రగఢ్-డెహ్రాడూన్ ఫాల్ట్ లైన్ దగ్గర తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. దీనిపై నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ కూడా ప్రత్యక్ష కన్ను వేసింది.
Also Read: కొత్త సంవత్సర ఆనందం ఆవిరి.. ఢిల్లీ, హర్యానాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..
సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం..రోహ్తక్-ఝజ్జర్ జోన్ III , జోన్ IVలో వస్తుంది. భారతదేశంలో భూకంపాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ రెండు, మూడు, నాలుగు మరియు ఐదు ఉన్నాయి. ఇది ప్రమాదాలను బట్టి కొలుస్తారు. జోన్ 2 అతి తక్కువ ప్రమాదకరమైనది , జోన్ 5 అత్యంత ప్రమాదకరమైనది. మ్యాప్లో జోన్ 2 ను నీలం రంగు లో.. జోన్ 3 పసుపు రంగులో .. జోన్ 4 నారింజ రంగులో జోన్ 5 ఎరుపు రంగులో సూచించబడుతుంది. అయితే.. రోహ్తక్ జిల్లాలోని ఢిల్లీ వైపు ప్రాంతం జోన్ నాలుగులో , హిసార్ వైపు ప్రాంతం జోన్ మూడులో వస్తుంది. దీంతో తరుచు భూప్రకంపనాలు ఏర్పడుతుంటాయి.