హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రత నమోదు..
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.2గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ జరగలేదు.
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో శనివారం తెల్లవారుజామున 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 5.17 గంటలకు ధర్మశాలకు తూర్పున 22 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్విట్టర్లో తెలియజేసింది. అయితే ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. దీనికి ఒకరోజు ముందు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గురువారం-శుక్రవారం రాత్రి 2:12 గంటలకు సంభవించిన మరో భూకంపం జోషిమఠ్ ప్రజలను కదిలించింది. పగటిపూట వర్షం, మంచు కారణంగా ఇప్పటికే కష్టాల్లో ఉన్న అక్కడి ప్రజలను ఇది మరింత ఇబ్బంది పెట్టింది.
అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదైంది. జోషిమఠ్ లో ఇళ్లు ఇప్పటికే బీటలు వారి ఉన్నందున్న ఇలాంటి భూ ప్రకంపనలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. అయితే తాజా భూకంపం వల్ల ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ జరగలేదు.
కాగా భూమి కుంగిపోవడంతో ప్రమాదకరంగా మారిన మలారి ఇన్, మౌంట్ వ్యూ హోటళ్లను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతోంది. భూకంప కేంద్రం జోషిమత్కు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం కారణంగా జోషిమఠ్లో నష్టం వాటిల్లుతుందనే భయాలు అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కూడా ఆందోళనకు గురిచేశాయి.
ఇదిలా ఉండగా ఈ ఏడాది మొదటి నుంచే భారత్ లో కూడా వరుస భూకంపాలు వచ్చాయి. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అదే రోజు ఉదయం 10.57 గంటలకు బంగాళాఖాతంలో మరో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అయితే ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
'ఆదిపురుష్' పై మరో వివాదం.. సర్టిఫికేట్ లేకుండా టీజర్ విడుదల.. సెన్సార్ బోర్డును వివరణ కోరిన కోర్టు
ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.5గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని బదఖ్సన్ ప్రాంతంగా ఉంది. దీని వల్ల ఢిల్లీతో పాటు జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని సామాన్లు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. జనవరి 8న జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్కు 10 కిలోమీటర్ల దూరంలో రాత్రి 11.12 గంటల సమయంలో 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.