అమెరికాలో వర్షబీభత్సానికి ఇద్దరు ప్రవాస భారతీయులు దుర్మరణం
అమెరికాలో ఇడా తుఫాన్ దాటికి కనీసం 65 మంది మరణించారు. ఇందులో ఇద్దరు ప్రవాస భారతీయులున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిరువురూ న్యూజెర్సీలోనే మరణించారు. సాఫ్ట్వేర్ డిజైనర్ మాలతి కంచె(46), ధనుశ్ రెడ్డి(31)లు ఈ బీభత్సంలో మరణించినట్టు సమాచారం.
న్యూయార్క్: అమెరికాలో ఇడా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, లూసియానాలను కుంభవృష్టి అతలాకుతలం చేసంది. ఈ తుఫాన్ బీభత్సంతో అమెరికాలో సుమారు 65 మంది మరణించారు. ఇందలో మెజార్టీగా న్యూయార్క్, న్యూజెర్సీ, లూసియానాల్లోనే రిపోర్ట్ అయ్యాయి. తాజాగా, ఈ మరణాల్లో ఇద్దరు ప్రవాస భారతీయులున్నట్టు తేలింది. న్యూజెర్సీలోనే ఈ ఇద్దరు ప్రవాస భారతీయులు మరణించారు.
సాఫ్ట్వేర్ డిజైనర్ మాలతి కంచె(46), ధనుశ్ రెడ్డి(31)లు మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు. బుధవారం మాలతి కంచె ఆమె 15ఏళ్ల కూతురిని కారులో ఇంటికి తీసుకెళ్లుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. న్యూజెర్సీలోని బ్రిడ్జీవాటర్ రోడ్ నెంబర్ 2 దగ్గర నడుములోతు నీరు చేరడంతో కారు ముందుకు కదలకుండా నిలిచిపోయినట్టు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. మాలతి, ఆమె కూతురు వరద నీటిలో కొట్టుకుపోకుండా ఓ చెట్టును ఆధారం చేసుకుని కొంత కాలం నిలిచారు. కానీ, ఆ చెట్టు కూడా కూలిపోవడంతో వారు వేగంగా పారుతున్న వరదలో కొట్టుకుపోయారు. తొలుత మాలతిని మిస్సింగ్ పర్సన్స్ జాబితాలో చేర్చారు. కానీ, ఆమె మరణించినట్టు అధికారులు శుక్రవారం ధ్రువీకరించారు.
న్యూజెర్సీలోని సౌత్ ప్లేన్ఫీల్డ్లో ధనుశ్ రెడ్డి వరద నీటిలో చిక్కుకుపోయారు. కానీ, ఆయన బ్యాలెన్స్ కోల్పోయి ఓ డ్రెయినేజీ పైప్లో జారిపడినట్టు తెలిసింది. అనంతరం ఆయన మృతదేహం కొన్ని మైళ్ల దూరంలో కనిపించినట్టు తెలిసింది.