మద్యం మత్తులో విమానంలో గొడవ... సిబ్బంది వేలు కొరికేసి...!
టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణీకుడు విమాన సిబ్బందితో గొడవకు దిగడంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది
మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు విమానంలో నానా రచ్చ చేసేశాడు. విమాన సిబ్బందితో గొడవ పడ్డాడు. అక్కడితో ఆగలేదు... విమానంలో ఓ సిబ్బంది వేలు కూడా కొరికేశాడు. ఈ సంఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణీకుడు విమాన సిబ్బందితో గొడవకు దిగడంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. బుధవారం ఇస్తాంబుల్ నుంచి జకార్తా వెళుతున్న టర్కీ ఎయిర్లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో... ఆ ప్రయాణికుడుని పట్టుకొని సంకెళ్లు వేసుకొని కిందకు దింపడానికి ప్రయత్నిస్తుండగా.... అతను.. వారిపై దాడి చేయడం గమనార్హం. విమాన సిబ్బందిని సదరు ప్రయాణికుడు కొట్టడం వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.
జకార్తా చేరుకోవాల్సిన విమానాన్ని బలవంతంగా మలేషియాలోని కౌలాలంపూర్కు మళ్లించారు. ఇది మెడాన్లోని కౌలానాము అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఆ సమయంలో ప్రయాణికుడు విపరీతంగా మద్యం సేవించి ఉన్నాడని.. ఆ మత్తులోనే ఈ రచ్చ చేశాడని చెబుతున్నారు. మరీ దారుణంగా... వేలు కొరకడం కూడా గమనార్హం.