దంపతుల హత్య చేసి.. దాదాపు 30 ఏళ్లు తప్పించుకు తిరిగాడు. చివరికీ మద్యం మత్తులో అసలు విషయం చెప్పేశాడు. మహారాష్ట్రలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
దోపిడికి పాల్పడి.. దంపతుల హత్య చేశాడు. ఊరు, పేరు మార్చుకున్నాడు. దాదాపు మూప్పై ఏండ్లు పరారీలో ఉన్నాడు. కానీ.. తాజాగా ఆ హంతకుడు పుల్ గా మద్యం సేవించి.. అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఈ విషయం పోలీసుల చెవిన పడటంతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారం మహారాష్ట్ర (Maharashtra)లోని ముంబయి (Mumbai)లో వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అవినాశ్ పవార్ అనే వ్యక్తి 30 ఏళ్ల క్రితం.. 1993లో లోనావాలాలోని ఓ ఇంట్లో తనతో పాటు మరో ఇద్దరితో కలిసి దోపిడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వారి అడ్డగించిన ఆ ఇంటి దంపతులను తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఈ కేసులో మిగతా ఇద్దరు నిందితులు పట్టుబడిన.. అవినాశ్ పవార్ మాత్రం తన తల్లిని విడిచిపెట్టి ఢిల్లీకి తప్పించుకోని పారిపోయాడు.
అక్కడినుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అవినాష్ తన పేరు, ఊరు మార్చుకుని దాక్కొన్నాడు. అప్పుడు అతని వయసు 19 ఏళ్లు. ఈ క్రమంలో అతని పేరుని అమిత్ గా మార్చుకున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డును అమిత్ పేరుతో తయారు చేయించుకున్నాడు. అతను తన చిరునామాను లోనావ్లా నుండి ముంబైలోని విక్రోలీకి మార్చుకున్నాడు. పెళ్లి చేసుకుని.. భార్యను రాజకీయాల్లో నిలబెట్టాడు.
ఇలా మూడు దశాబ్దాలుగా నేరాన్ని దాచిపెట్టి.. హాయిగా రాజాలా బతికాడు. తాను ఎప్పటికీ పట్టుబడననే ధీమాతో ఉన్నాడు. కానీ, ఇటీవల తన స్నేహితులతో జరిగిన మద్యం విందులో అసలు విషయాన్ని కక్కేశాడు. ఈ విషయం కాస్తా.. బాంద్రా క్రైమ్ బ్రాంచ్ యూనిట్ సీనియర్ పీఐ, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ కు తెలిసింది. మరుసటి రోజే అవినాష్ అలియాస్ అమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. 1993లో వెళ్లిపోయిన తర్వాత అతను ఎప్పుడూ లోనావాలాకు రాలేదని.. అతని తల్లిని, అదే పట్టణంలో నివసించే భార్య కుటుంబీకులనూ కలవలేదని చెప్పారు.
