విద్యుత్ కోతలకు కారణాలు చెప్పడానికి ప్రభుత్వం లేదని, ఆ సమస్యను పరిష్కరించడానికే ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు. విద్యుత్ సంక్షోభంపై ఆయన శనివారం యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరంతరం ప్రజలకు కరెంటు అందించాలని సూచించారు.

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విద్యుత్ సంక్షోభంపై యూపీ ప్ర‌భుత్వానికి చుర‌క‌ల అంటించారు. విద్యుత్ స‌మ‌స్య‌పై కార‌ణాలు చెప్ప‌డానికి ప్ర‌భుత్వం లేద‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ విధి ఇది కాద‌ని అన్నారు. ఈ మేరకు శ‌నివారం ఆయ‌న ట్వీట్ చేశారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు మూసివేశామ‌ని మాట్లాడిన యూపీ ఇంధన శాఖ మంత్రి ఎకె శర్మ ఇచ్చిన స‌మాచారాన్ని కూడా ఆయ‌న షేర్ చేశారు.‘‘ ప్రభుత్వ పని సమస్యకు కారణాన్ని చెప్పడం కాదు. దానిని పరిష్కరించడం ’’ అంటూ పోస్ట్ చేశారు. 

యూపీ మంత్రి ఎకె శర్మ శుక్రవారం ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘ సాంకేతిక కారణాల వల్ల హర్దుగాంజ్-660 మెగావాట్లు, మెజా-660 మెగావాట్లు, బారా-660 మెగావాట్లుతో పాటు యూపీలో కొన్ని కొన్ని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు చాలా వారాల నుంచి మూసివేసి ఉన్నాయి. హర్దుగంజ్-605 మెగావాట్లు కూడా దెబ్బతిన్నాయి. వాటిని సరిచేసి యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.’’ అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో నేడు అఖిలేష్ యాద‌వ్ ఈ విధంగా ట్వీట్ చేశారు. 

శుక్రవారం కూడా ఎస్పీ చీఫ్ విద్యుత్ సంక్షోభంపై అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్ లతో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు వేడి, అప్రకటిత విద్యుత్ కోతలతో మండిపోతున్నారని ఆరోపించారు. పూర్వాంచల్ నుండి పశ్చిమ ఉత్తరప్రదేశ్ వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వేడి పెరగడంతో విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతోందని యాదవ్ అన్నారు. మ‌రో ట్వీట్ లో ఆయ‌న ‘‘ వేసవి కారణంగా విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. సాంకేతిక కారణాల వల్ల చాలా పవర్ ప్లాంట్లు వారాల తరబడి మూసివేతకు గురయ్యాయి. కాబట్టి విద్యుత్ ఆదా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయండి. మా విద్యుత్ కార్మికులు పగలు, రాత్రి పని చేస్తున్నారు. అంతరాయం లేని సరఫరాను నిర్ధారించండి.’’ 

కాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం విద్యుత్ శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి అదనపు (యూనిట్ల) విద్యుత్ కోసం కూడా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయినా లేదా విద్యుత్ వైర్లు దెబ్బతిన్నా వెంటనే సమస్యను పరిష్కరించాలని యోగి అన్నారు. 

యూపీలో విద్యుత్ కోతలపై ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ దాదాపు 22,000 మెగావాట్లు ఉందని, కానీ ఇప్పుడు ల‌భ్య‌త దాదాపు 19,000 మెగావాట్లుగా ఉంద‌ని చెప్పారు. దీని వ‌ల్ల గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్తు నిలిచిపోతోంద‌ని చెప్పారు. అయితే గ‌తంలో గ్రామీణ ప్రాంతాల్లో స‌గటున 18 గంట‌ల క‌రెంట్ ఇస్తే ఇప్పుడు 15 గంటల ఏడు నిమిషాలు.. ప‌ట్ట‌ణాల్లో 19 గంటల మూడు నిమిషాలు ఇస్తున్నామ‌ని తెలిపారు. తహసీల్ ప్రధాన కార్యాలయంలో 19 గంటల 50 నిమిషాలు, జిల్లా కేంద్రంలో మాత్రం 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 5820 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండ‌గా.. మిగితా మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నారు.