క్యూనెట్ ఒక ఫ్రాడ్ సంస్థ.. అలాంటి ఎంఎల్ఎం సంస్థల వలల్లో చిక్కుకోవద్దు: వీసీ సజ్జనార్
క్యూనెట్కు చెందిన రూ. 90 కోట్ల మొత్తాన్ని ఈడీ సీజ్ చేసిన నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సైబరాబాద్ మాజీ సీపీ వీసీ సజ్జనార్ స్పందించారు. 2019లో ఆయన సీపీగా ఉన్నప్పుడు క్యూనెట్ సంస్థ అక్రమాలపై విరుచుకుపడ్డారు. తాజాగా రియాక్ట్ అవుతూ అదొక ఫ్రాడ్ సంస్థ అని, అలాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ వలల్లో చికుకోవద్దని ప్రజలకు సూచించారు.
హైదరాబాద్: తక్కువ పెట్టుబడులతో అధికా లాభాలు వస్తాయని ఆశపెట్టి క్యూనెట్ వంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలు సామాన్యులకు వల విసురుతాయని, వాటి మాయాజాలంలో పడొద్దదని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ ఒక ఫ్రాడ్ సంస్థ అని స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ చైన్ సిస్టమ్ పద్ధతిలో వేల కోట్ల రూపాయలను అమయాకుల నుంచి కొల్లగొడుతున్నదని వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా క్యూనెట్కు చెందిన 36 బ్యాంకు ఖాతాల్లోని రూ. 90 కోట్ల మొత్తాన్ని సీజ్ చేసిందని తెలిపారు. అంతేకాదు, ఇతర దర్యాప్తు సంస్థలన్నీ కూడా క్యూనెట్ ఒక మోసపూరితమైన సంస్థ అని వెల్లడించాయని పేర్కొన్నారు.
అందుకే ఎంఎల్ఎం సంస్థలు మోసపూరితమైనవని, అవి ఒకరోజు కాకుంటే మరో రోజ.. ఏదో ఒక రోజు కచ్చితంగా వాటి మోసాలు బయటపడతాయని స్పష్టం చేశారు. అలాంటి కంపెనీల మోసపూరిత స్కీమ్లతో సంబంధం ఉన్న వ్యక్తులపైనా దర్యాప్తు సంస్థలు చట్టపరంగా చర్యలు తీసుకుంటాయని వివరించారు.
బ్యాంకర్ల కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడం ఏ సంస్థకూ సాధ్యం కాదనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో లేని ఏ సంస్థనూ నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచనలు చేశారు. ఎంఎల్ఎం సంస్థ వలలో పడొద్దని, ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
సైబరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ ఉన్నప్పుడు క్యూనెట్ మోసాలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఆ కంపెనీకి చెందిన మోసాలపై దేశవ్యాప్తంగా దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. క్యూనెట్ను ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలు అనిల్ కపూర్, బొమన్ ఇరానీ, జాకీష్రాఫ్, పూజా హెగ్దే, షారూఖ్ ఖాన్కూ 2019లో నోటీసులు పంపారు. ఇందుకు సంబంధించిన కేసులో 500 మందికి సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా క్యూనెట్ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. క్యూనెట్ వంటి మోసపూరిత గొలుసుకట్టు జాతీయ, అంతర్జాతీయ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు.