విమాన సేవలపై ఆంక్షలు ఎత్తివేత.. దేశీయంగా ఫుల్ కెపాసిటీతో ప్రయాణించవచ్చు.. కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా సేవలు అందించే విమానాలు పూర్తి సామర్థ్యంతో ప్రయాణించవచ్చునని తెలిపింది. ఈ నెల 18 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వివరించింది. అంతర్జాతీయ విమాన సేవలపై గతేడాది నుంచి ఇప్పటి వరకు ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో టూరిజం, వైమానిక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. corona virus వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు flights సేవలపై ఆంక్షలు విధించాయి. ఫస్ట్ వేవ్ సమయంలోనూ పూర్తిగా విమానాలనూ నిలిపేసిన సందర్భాలున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ పూర్తిస్థాయిలో విమాన సేవలు అందుబాటులోకి రాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా విమానాలు పూర్తి సామర్థ్యంలో ప్రయాణించవచ్చునని వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం domestic విమానాలు గరిష్టంగా 85శాతం సామర్థ్యంతోనే ప్రయాణించాలని ఆంక్షలున్నాయి. అంతుకు ముందు ఈ పరిమితిని కేంద్రం 72.5శాతంగా ప్రకటించింది. ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ పరిమితి అమల్లోకి వచ్చింది. జులై 5 నుంచి ఆగస్టు 12వ తేదీ మధ్య ఈ పరిమితి 65శాతంగా అమలులో ఉంది. జూన్ 1 నుంచి జులై 5 వరకు ఇదే లిమిట్ 50శాతంగా అమలు చేసింది.
Also Read: ఆకాశంలో విమానాలు ఢీ.. మంటలు అంటుకోగానే దూకేసిన ప్యాసింజర్లు.. భయానక వీడియో వైరల్..
దేశంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో గతేడాది మార్చిలో అంతర్జాతీయ, దేశీయ విమాన సేవలపై ఆంక్షలు విధించింది. అనంతరం రెండు నెలల తర్వాత దేశీయ విమానాలు మొత్తం సామర్థ్యంలో 33శాతం ప్రయాణికులతో వెల్లడానికి అవకాశమిచ్చింది. తర్వత క్రమంగా గతేడాది డిసెంబర్ వరకు ఈ పరిమితిని 80శాతం వరకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇవే నిబంధనలు ఈ ఏడాది జూన్ 1వ తేదీ వరకు అమల్లో ఉన్నాయి.
కాగా, మేలో మరోసారి కేసులు విజృంభించడంతో ఈ కెపాసిటీని తగ్గించింది. మే 28న ఈ పరిమితిని 80శాతం నుంచి 50శాతానికి తగ్గించింది.