నిత్యానంద, ఆయన కైలాస దేశం గురించి చాట్ జీపీటీ ఏం చెప్పిందో తెలుసా..?
ChatGPT: అత్యాచారం సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద భారత్ నుంచి పారిపోయి కైలాస అనే దేశాన్ని ఏర్పర్చుకున్నట్టు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కైలాస తరఫున ప్రతినిధులు పాలుపంచుకుని ప్రసంగించినట్టు మీడియా నివేదికలు, సంబంధిత వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, నిత్యానంద, కైలాస దేశం గురించి ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీని అడగ్గా..
What ChatGPT Said About Nithyananda: అత్యాచారం సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద.. భారత్ నుంచి పారిపోయి 'కైలాస' అనే దేశాన్ని స్థాపించినట్టు పేర్కొన్నారు. ఆ ప్రకటన తర్వాత కైలాస గురించిన వార్తలు, కథనలు వైరల్ అయ్యాయి. అయితే, గతకొంత కాలంగా దీని గురించి పెద్దగా వినిపించలేదు. కైలాస దేశాన్ని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు. అయితే, తాజగా కైలాసకు చెందిన ప్రతినిధులు కొందరు ఐరాస సమావేశానికి హాజరుకావడం, దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిత్యానంద, ఆయన దేశం కైలాస మళ్లీ వార్తల్లో నిలిచింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద పలు కేసులను ఎదుర్కొంటున్నప్పటికీ శిక్ష నుంచి తప్పించుకునేందుకు భారత్ నుంచి పారిపోయాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ ఆయన గురించి, ఆయన చేసే పని గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో ఉంది.
అందుకే ఏఐ చాట్ బాట్ అయిన చాట్ జీపీటీని స్వయం ప్రకటిత గాడ్ మ్యాన్ నిత్యానంద గురించి అడగ్గా, దానికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అయిన చాట్ జీపీటీ గత ఏడాది నవంబర్ లో అధికారికంగా ప్రారంభించినప్పటి నుండి కవితలు, ప్రసంగాలు, పరీక్ష ప్రశ్నలకు సంబంధించి ఏదీ అడిగినా సమాధానాలు ఇవ్వడంతో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇటీవలే చాట్ జీపీటీని ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయడంతో వివిధ అంశాలపై సంభాషణా పద్ధతిలో మరింతగా సమాధానాలు అందిస్తోంది.
ఏఐ చాట్ బాట్ అయిన చాట్ జీపీటీని నిత్యానంద ఎవరని ప్రశ్నించగా.. ఆయన వివాదాస్పద భారతీయ ఆధ్యాత్మిక గురువు, నిత్యానంద ధ్యానపీఠం సంస్థ వ్యవస్థాపకుడు అని పేర్కొంది. ఆయన 1977లో తమిళనాడులో జన్మించారనీ, తాను జ్ఞానవంతుడినని, హిందూ మతం, బౌద్ధం, నవయుగ ఆధ్యాత్మికత మేళవింపును బోధిస్తున్నానని చెప్పుకున్నట్టు చాట్ జీపీటీ తన సమాధానంలో చెప్పింది. 2010లో జరిగిన అత్యాచారం కేసు, ఆ తర్వాత బెయిల్ గురించి కూడా ఏఐ చాట్ బాట్ ప్రస్తావించింది.
ఇక 'కైలాస' అని పిలువబడే దేశం గురించి చాట్ జీపీటీని అడగ్గా.. "నిత్యానంద కైలాస అనే కొత్త దేశాన్ని స్థాపించినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, కైలాస అనేది సనాతన హిందూ ధర్మ పురాతన జ్ఞానోదయ హిందూ నాగరికత పునరుజ్జీవనం, ఇది కాలక్రమేణా కోల్పోయింది లేదా అణిచివేయబడిందని ఆయన నమ్ముతున్నాడు" అని పేర్కొంది. హిందూ సూత్రాలు, ఆచారాల ఆధారంగా ప్రజలు వేధింపులు, వివక్ష లేకుండా జీవించగల ప్రదేశమే కైలాస అని నిత్యానంద పేర్కొన్నారు. ప్రజలు ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని అనుభవించే ప్రదేశం కైలాస అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఏ ఇతర దేశం లేదా అంతర్జాతీయ సంస్థ కైలాసను సార్వభౌమ దేశంగా గుర్తించలేదని చాట్ జీపీటీ యూజర్ కు తెలియజేసింది.
కైలాస దేశానికి రాజ్యాంగం ఉందా? దానికి చట్టపరమైన హోదా ఉందా? అనే ప్రశ్నలకు కూడా చాట్ బోట్ సమాధానమిచ్చింది. కైలాసకు ఒక రాజ్యాంగం ఉందని నిత్యానంద పేర్కొన్నారనీ, అది కాలక్రమేణా అభివృద్ధి చెందే "సజీవ పత్రం" అని ఆయన అభివర్ణించారు. అయితే, రాజ్యాంగం ఖచ్చితమైన కంటెంట్ ఏమిటో లేదా దానిని ఎలా అభివృద్ధి చేశారో స్పష్టంగా తెలియదు" అని చాట్ జీపీటీ తెలిపింది. నిత్యానంద చుట్టూ ఉన్న వివాదం దృష్ట్యా రాజ్యాంగ చట్టబద్ధత, దాని అమలుపై కూడా సందేహం రావచ్చునని పేర్కొంది.
అలాగే, కైలాసకు వెళ్లడం, వీసాల గురించి అడగ్గా.. "లేదు, మీరు కైలాసను సందర్శించలేరు, ఎందుకంటే ఇది మరే ఇతర దేశం లేదా అంతర్జాతీయ సంస్థచే గుర్తించబడిన సార్వభౌమ దేశం కాదు. అందువల్ల దీనికి ఎలాంటి అధికారిక సరిహద్దులు, వీసా విధానాలు లేవు. 'కైలాస'ను సందర్శించడం మంచిది కాదనీ, ఇది మిమ్మల్ని చట్టపరమైన లేదా వ్యక్తిగత ప్రమాదంలో పడేస్తుందని కూడా చాట్ బోట్ హెచ్చరించింది. కైలాస బృందం ప్రతినిధులకు ఐరాసలో పాల్గొనే హక్కు లేదని ఏఐ బోట్ పేర్కొంది. కైలాసను సార్వభౌమ దేశంగా గుర్తించనందున ఐరాసలో సభ్యత్వానికి అర్హత లేదనీ, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల్లో పాల్గొనలేరని స్పష్టం చేసింది.