పన్నీరు సెల్వంకు షాకిచ్చిన హైకోర్టు .. పార్టీ పగ్గాలు పళనిస్వామికే
తమిళనాట అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)నాయకత్వం విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ఆ పార్టీ అధినేత కె. పళనిస్వామి అప్పీల్ ను స్వీకరించిన మద్రాసు హైకోర్టు .. శుక్రవారం నాడు పన్నీర్ సెల్వంకు అనుకూలంగా వచ్చిన తీర్పును రద్దు చేసింది.
తమిళనాట రాజకీయాలు రోజుకో కీలక మలుపులు తిరుగుతున్నాయి. తమిళనాడు ప్రతిపక్ష అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)నాయకత్వం విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పార్టీ అధినేత కె. పళనిస్వామి అప్పీల్ ను స్వీకరించిన మద్రాసు హైకోర్టు .. శుక్రవారం నాడు పన్నీర్ సెల్వంకు అనుకూలంగా వచ్చిన తీర్పును రద్దు చేసింది. దీంతో అన్నాడీఎంకే నేత పన్నీర్సెల్వంకు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పార్టీ నాయకత్వ వివాదంపై అన్నాడీఎంకే నేత పళనిస్వామి దాఖాలు చేసిన అప్పీల్ను మద్రాసు హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ అప్పీల్ ను జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
ఈ క్రమంలో జులై 11న జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం చెల్లదంటూ.. ఆగస్టు 17న జస్టిస్ జి జయచంద్రన్తో కూడిన సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఈ క్రమంలో జూన్ 23న జరిగిన సమావేశం చట్టవిరుద్ధమని పేర్కొంటూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఇరువర్గాలను ఆదేశించింది. దీంతో అన్నాడీఎంకే పార్టీ నాయకత్వం విషయంలో మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి మద్రాస్ హైకోర్టు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జూలై 11న జరిగింది. ఈ సమావేశంలో పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా, అత్యున్నత పదవిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో, పన్నీర్ సెల్వం పార్టీ నుండి తొలగించబడ్డారు, దీనికి వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో అన్నాడీఎంకే పార్టీ పళనిస్వామి ఏక నాయకత్వంలో కొనసాగనుంది.
జూలై 11న సమావేశానికి ముందు, జూన్ 23న పార్టీలో మొదటి సమన్వయకర్తలుగా పన్నీర్సెల్వం మరియు జాయింట్ కోఆర్డినేటర్లుగా పళనిస్వామి ఉన్నారు. జూన్ 23న ఇద్దరు అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్సెల్వం సంయుక్తంగా సమావేశానికి పిలుపునిచ్చారు.
అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణానంతరం నుంచి (2016).. ఆ పార్టీ ద్వంద్వ నాయకత్వాన్ని అనుసరిస్తోంది. కానీ, పళనిస్వామి మాత్రం పార్టీలో ఏక నాయకత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం.