మరణించిన ఆ వ్యక్తికి యూఏఈలోనే మంకీపాక్స్ పాజిటివ్: కేరళ హెల్త్ మినిస్టర్
కేరళలో మరణించిన ఆ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్గా తేలిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. జులై 19నే ఆయన యూఏఈలో మంకీపాక్స్ టెస్టు కోసం నమూనాలు ఇచ్చారని వివరించారు. జులై 30న మరణించినట్టు తెలిపారు.
తిరువనంతపురం: దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైన సంగతి తెలిసిందే. అయితే, తొలి కేసు చుట్టూ నాటకీయత అలుముకోవడంతో స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలోనే కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జీ తొలి మంకీపాక్స్ మరణం పై కీలక ప్రకటన చేశారు.
ఓ యువకుడు జులై 22న యూఏఈ నుంచి భారత్కు తిరిగి వచ్చాడని ఆమె చెప్పారు. ఆయనలో 26న జ్వరం మొదలైనప్పుడు కుటుంబ సభ్యులతోనే ఉన్నాడని తెలిపారు. జులై 27న ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 28వ తేదీన వెంటిలేటర్ పైకి చేర్చారు అని ఆమె వరుసగా కీలక ఘట్టాలను పేర్కొన్నారు. జులై 30వ తేదీన ఆయన మరణించాడని వివరించారు.
అయితే, ఆయన యూఏఈలో ఉన్నప్పుడే మంకీపాక్స్ టెస్టు కోసం శాంపిల్స్ ఇచ్చాడని ఆమె తెలిపారు. జులై 19న ఆయన యూఏఈలో నమూనాలు ఇచ్చారని వివరించారు. ఆయన కేరళలో హాస్పిటల్లో చేరడం, ఆయనకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించడం కలకలం రేపాయి. ఆయనది మంకీపాక్స్ మరణమే అని చాలా మంది నిపుణులు భావించారు.
ఈ నేపథ్యంలోనే హెల్త్ డిపార్ట్మెంట్ టీమ్ యూఏఈ వెళ్లిందని రాష్ట్ర మంత్రి వీణా జార్జి తెలిపారు. ఆ శాంపిల్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ప్రస్తుతం ఓ టీమ్ను ఏర్పాటు చేసి జీనోమిక్ సీక్వెన్సింగ్ చేపడుతున్నట్టు వివరించారు.
ప్రొటోకాల్ ప్రకారం, 20 మంది హై రిస్క్లో ఉన్నట్టు మంత్రి తెలిపారు. అబ్జర్వేషన్లో ఉన్నవారిలో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, మిత్రులు, మెడికల్ స్టాఫ్ ఉన్నట్టు వివరించారు.