ధన్బాద్ అగ్నిప్రమాదం : బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల సహాయాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ...
ధన్బాద్ అగ్నిప్రమాదం ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 కూడా మంజూరు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

న్యూఢిల్లీ : ధన్బాద్లోని అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 కూడా మంజూరు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ధన్బాద్లోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో 14 మంది మరణించగా, 12 మంది గాయపడ్డారు. "ధన్బాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 ఇస్తాం" అని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ట్వీట్ చేసింది.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. "ధన్బాద్లో అగ్నిప్రమాదం కారణంగా 14మంది ప్రాణాలు కోల్పోవడం నన్ను కలిచివేసింది. వారి కుటుంబాల నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని పిఎంఓ ట్వీట్ చేసింది.
అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి
అంతకుముందు, ధన్బాద్లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందడం పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని సోరెన్ చెప్పారు.
ధన్బాద్లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం కారణంగా 14మంది మరణించడం చాలా హృదయ విదారకం, జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తోంది. మొత్తం విషయాన్ని నేనే స్వయంగా పరిశీలిస్తున్నాను" అని సీఎం సోరెన్ ట్వీట్ చేశారు.
క్షతగాత్రులకు త్వరితగతిన వైద్యం అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. "భగవంతుడు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబాలకు కష్ట సమయాలను భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. క్షతగాత్రులకు త్వరితగతిన వైద్యం అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం" అని ఆయన ట్వీట్ చేశారు.
ఎస్ఎస్పి ధన్బాద్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదసమయంలో అపార్ట్మెంట్లో వివాహ కార్యక్రమం కోసం చాలా మంది గుమిగూడారు. అయితే, అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ముందు మేము బాధితులను కాపాడడం మీదే దృష్టి పెట్టాం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం" అని కుమార్ చెప్పారు.
మంగళవారం రోజు రాత్రి, అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చాలామంది భవనం లోపల చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.