కేరళకు మరో ముప్పు
భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ రాష్ట్రానికి తుఫాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో మరో కొత్త తుఫాన్ ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తిరువనంతపురం: భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ రాష్ట్రానికి మరో ముప్పు సంభవించనుంది. అరేబియా సముద్రంలో మరో కొత్త తుఫాన్ ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఫలితంగా దేవభూమి పై మరో వర్షపు పంజా పడే అవకాశం ఉందని తెలియడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుఫాన్ కు లూఫన్ పేరు కూడా పెట్టినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
లూఫన్ ప్రభావం వల్ల కేరళకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇడుక్కి, పలక్కాడ్, వయనాడ్,త్రిస్తూర్ జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది.
మరోవైపు లూఫన్ ఒమన్ తీరంవైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా కేరళ, దక్షిణ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే చెన్నై, పుదుచ్ఛేరిలలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఆగష్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు, వరదలతో కేరళ చిగురుటాకులా వణికిపోయింది. దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేరళ రాష్ట్రం కకావికలమైంది. దాదాపుగా 30వేల కోట్లు ఆస్థినష్టం సంభవించింది.