డెల్టా వేరియంట్ తో అమెరికాకి కూడా ముప్పే..!
గడిచిన కొన్ని వారాల్లో రెండు వారాలకు ఒకసారి డెల్టా వేరియంట్ కేసులు రెట్టింపు అవుతుండడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. కాగా... భారత్ లో డెల్టా వేరియంట్ చాలా ప్రభావం చూపించింది. కాగా... ఈ ప్రభావం అగ్ర రాజ్యం అమెరికా పై కూడా చూపించే అవకాశం ఉందని... ఆ దేశ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌసీ అన్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల్లో సుమారు 20 శాతం డెల్టావేనని పేర్కొన్నారు. మంగళవారం శ్వేతసౌధం వద్ద ఫౌసీ మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన కొన్ని వారాల్లో రెండు వారాలకు ఒకసారి డెల్టా వేరియంట్ కేసులు రెట్టింపు అవుతుండడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు.
మే 8న దేశవ్యాప్తంగా 1.2 శాతంగా ఉన్న ఈ కేసులు ఆ తర్వాత రెండు వారాలకు 2.9 శాతానికి, తర్వాతి రెండు వారాలకు 9.9 శాతానికి చేరాయన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 20 శాతం ఈ వేరియంట్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్లో డెల్టా వేరియంట్ సష్టిస్తున్న బీభత్సాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే మాదిరి అగ్రరాజ్యంలో కూడా భారీగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడం కూడా ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై 4 నాటికి 70 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ పూర్తి చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టార్గెట్ను చేరుకోవడం అంతా ఈజీ కాదని ఆయన తెలిపారు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) లెక్కల ప్రకారం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా సుమారు 65 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైందని, జూలై 4 వరకు ఈ సంఖ్య 67 శాతానికి చేరుకోగలదని ఫౌసీ వెల్లడించారు. ఈ అంశం కూడా దేశంలో డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.
ప్రధానంగా 18-26 ఏళ్ల యువత వ్యాక్సినేషన్ పట్ల విముఖత చూపడం మంచిది కాదన్నారు. ఎందుకంటే డెల్టా వేరియంట్ కేసుల్లో అధికంగా యువతనే ఉంటున్నారని ఫౌసీ గుర్తు చేశారు. కనుక టీకాల విషయంలో అపోహలకు పోకుండా యువత ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.