సారాంశం

Delhi Weekend curfew: ఢిల్లీలో క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ త‌రుణంలో వారాంతపు కర్ఫ్యూ,  దుకాణాలకు సరి-బేసి నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ల నేప‌థ్యంలో నగరంలో క‌రోనా మహమ్మారి పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) గురువారం సమావేశం కానున్న‌ది. నేడు  లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన డీడీఎంఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
 

Delhi Weekend curfew:  ఢిల్లీలో క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ త‌రుణంలో వారాంతపు కర్ఫ్యూ,  దుకాణాలకు సరి-బేసి నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ల నేప‌థ్యంలో నగరంలో క‌రోనా మహమ్మారి పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) గురువారం సమావేశం కానున్న‌ది.  ఈ స‌మావేశం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు జరుగ‌నున్న‌ది. ఈ స‌మావేశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా  కోవిడ్-19 స‌మీక్ష స‌మావేశంలో హాజరయ్యే అవకాశం ఉంది. 

సడలింపులపై ఢిల్లీ స‌ర్కార్ కూడా సానుకూలంగా ఉంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా..  వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, నగరంలో దుకాణాలకు సరి-బేసి నిబంధనను ఎత్తివేయాలనే ప్రతిపాద‌న‌లు ఉన్నాయి. అయితే.. పరిస్థితి మరింత మెరుగుపడే వరకు ఆంక్షలపై యథాతథ స్థితిని కొనసాగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ సూచించారు.

అయితే ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఎల్‌జీ కార్యాలయం ఆమోదం తెలిపింది. నగరంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రజల జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం పడకుండా..  ఆంక్షలను సడలించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.


పాఠశాలలు త్వరలో పునఃప్రారంభం!

పాఠశాలల పునఃప్రారంభంపై డీడీఎంఏతో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. పిల్లల సామాజిక, మానసిక వికాసానికి నష్టం జరగకుండా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. DDMA సమావేశంలో  పాఠశాలలను తిరిగి తెరవాలని సిఫార్సు చేశామ‌ని తెలిపారు. ఆన్‌లైన్ క్లాసులు జ‌రుగుతోన్న‌.. అవి.. ఆఫ్‌లైన్ విద్యను ఎప్పటికీ భర్తీ చేయలేవని ఢిల్లీ డిప్యూటీ సిఎం కూడా ఉద్ఘాటించారు. కరోనా విజృంభ‌న స‌మ‌యంలో..ప్రభుత్వం పాఠశాలలను మూసివేసిందని, అయితే మితిమీరిన జాగ్రత్త ఇప్పుడు విద్యార్థులకు హాని కలిగిస్తోందని అన్నారు. దీని ప్ర‌భావం  వారి చదువుపైనే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిందని సిసోడియా పేర్కొన్నారు. 

ఇదిలాఉంటే.. క‌రోనా కేసులు కాస్త తగ్గు ముఖం ప‌డుతుండ‌టంతో.. ఆంక్షాల‌న‌లు తొలగించాలంటూ ఢిల్లీ వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోనే కాకుండా అనేక ప్రాంతాలలో వ్యాపారులు  ఆంక్షలను ఎత్తివేయాలంటూ.. నిరసనలు చేస్తున్నారు.బేసి-సరి విధానాన్ని కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా నగరంలో శుక్రవారం రాత్రి 10 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ అమలు ఉంటుంది. నగరంలో COVID-19 కేసుల పెరుగుదల కారణంగా వారాంతపు కర్ఫ్యూ విధించాలని DDMA జనవరి 1న నిర్ణయం తీసుకుంది. కేవ‌లం అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మాత్ర‌మే అనుమ‌తించింది ఢిల్లీ స‌ర్కార్. ఢిల్లో ఒక రోజులో 7,498 తాజా COVID-19 కేసులు మరియు 29 మరణాలు నమోదయ్యాయి.