ఢిల్లీలో ఉగ్రదాడికి పాక్ ఐఎస్ఐ నిఘా సంస్థ పన్నిన కుట్రను భారత గూఢచారులు సీక్రెట్ ఆపరేషన్తో ఛేదించారు.
పహల్గాం కంటే ముందే ఢిల్లీలో పాక్ ఐఎస్ఐ కుట్రలు..!
పహల్గాం దాడుల తరువాత యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దారుణ ఘటనకు పాక్ ఉగ్ర ముఠాలతో సంబంధాలున్నట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పహల్గాం ఘటన కంటే కొన్ని వారాల ముందే ఢిల్లీలో ఓ భారీ ఉగ్రదాడి కి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు తాజాగా తెలిసింది. నేపాల్ గూఢచారితో ఐఎస్ఐ పన్నిన ఈ కుట్రను మన నిఘా సంస్థలు సీక్రెట్ ఆపరేషన్తో భగ్నం చేశాయి.
నేపాల్ మీద నుంచి ఢిల్లీకి..
ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెలువరించాయి.భారత సాయుధ దళాలకు సంబంధించిన రహస్యమైన పత్రాలు, కీలక ప్రదేశాల ఫొటోలను సేకరించడం కోసం పాక్ ఐఎస్ఐ తమ గూఢచారిని నేపాల్ మీదుగా ఢిల్లీకి పంపించినట్లు ఈ ఏడాది జనవరిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. అదే సమయంలో ఢిల్లీ పోలీసులకు కూడా ఓ పాకిస్థానీ ఏజెంట్ గురించి సమాచారం తెలిసింది. దీంతో కేంద్ర సంస్థలతో కలిసి ఢిల్లీ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే, అప్పటికే నేపాల్ జాతీయుడైన ఆ గూఢచారి అన్సారుల్ మియాన్ అన్సారీ ఢిల్లీకి చేరుకుని, కొన్ని మిలిటరీ డాక్యుమెంట్లను సంపాదించాడు.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15న ఢిల్లీలోని హోటల్ నుంచి అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ మీదుగా పాకిస్థాన్కు తిరిగెళ్లేందుకు అన్సారీ ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కాడు. ఇక, అన్సారీకి సాయం చేసిన రాంచీకి చెందిన అజామ్ అనే వ్యక్తిని కూడా పట్టుకున్నారు. వీరిద్దరూ పాక్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. అనంతరం వీరిద్దరి తిహాడ్ జైలుకు తరలించి విచారణ చేపట్టారు.
విచారణలో ఐఎస్ఐ గూఢచర్య నెట్వర్క్ గురించి అన్సారీ కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. నేపాల్కు చెందిన ఇతడు ఖతార్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండగా ఐఎస్ఐకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు అన్సారీని పాకిస్థాన్కు తీసుకెళ్లాడు. అక్కడ అతడికి కొన్ని రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఢిల్లీ పంపించినట్లు విచారణలో తెలిసింది. అనంతరం అజామ్తో కలిసి మిలిటరీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించినట్లు అన్సారీ దర్యాప్తులో అంగీకరించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఢిల్లీలో ఐఎస్ఐ సెల్ను పట్టుకోవడంతో భారీ ఉగ్ర కుట్ర తప్పిందంటూ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.