సారాంశం

ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం సోదాలు చేపట్టింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 30కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం సోదాలు చేపట్టింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 30కి పైగా ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల సందర్భంగా  జర్నలిస్టులు, ఉద్యోగుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక, న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే, ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ దాడులపై సీనియర్ జర్నలిస్టు అభిసార్ శర్మ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులు నా ఇంటి వద్ద దిగారు. నా ల్యాప్‌టాప్, ఫోన్‌ను తీసుకెళ్లారు’’ అని పేర్కొన్నారు. ఇదిలాఉంటే, గతంలో కూడా న్యూస్‌క్లిక్‌కు చెందిన ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. 

ఇక, న్యూస్‌క్లిక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యూస్‌క్లిక్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.. న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.

నేపథ్యం..
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ)ని ఉల్లంఘించి న్యూస్‌క్లిక్ విదేశీ నిధులు పొందిందని ఆరోపణలు ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై న్యూస్‌క్లిక్ ప్రాంగణాలు, న్యూస్‌క్లిక్ సంపాదకుల నివాసాలపై ఈడీ దాడులు చేసింది. 2018, 2021 మధ్య న్యూస్‌క్లిక్ ద్వారా మొత్తం రూ. 77 కోట్లకు పైగా విదేశీ రెమిటెన్స్‌లు వచ్చినట్లు ఆ సమయంలో ఈడీ దర్యాప్తులో తేలింది. 

చైనీస్ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్‌వర్క్‌లో న్యూస్‌క్లిక్‌ అవుట్‌లెట్ భాగమని న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ ఆరోపణలు న్యూస్‌క్లిక్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధనలు, చర్యలకు మరింత ఊతమిచ్చాయి.