ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన యాత్రలో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. రెండు మతస్తుల మధ్య మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్లపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తుగా అనుమతి తీసుకోలేదని కేసు నమోదు చేసినట్టు డీసీపీ రంగ్నాని తెలిపారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం మత ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జహంగిర్పురిలో రెండు మతస్తుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్లపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. జహంగిర్పురిలో హనుమాన్ జయంతి యాత్ర నిర్వహించడానికి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు ఈ రెండు సంస్థలపై కేసులు నమోదు చేశారు.
ఈ నెల 16వ తేదీన జహంగిర్పురి పోలీసు స్టేషన్ ఏరియాలో విశ్వ హిందు పరిషద్, భజరంగ్ దళ్లు ముందస్తు అనుమతి లేకుండా యాత్ర చేపట్టాయని, ఏప్రిల్ 17వ తేదీన కేసు నమోదు చేసినట్టు డీసీపీ ఎన్డబ్ల్యూ ఉషా రంగ్నాని తెలిపారు. అంతేకాదు, నిందితులు ప్రేమ్ శర్మ, జిలా సేవక్ ప్రముఖ్ విశ్వ హిందు పరిషద్ను అరెస్టు చేసినట్టు వివరించారు.
ఈ కేసులో సోమవారం మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్క్రాప్ డీలర్ 36 ఏళ్ల షేక్ హమీద్ను పోలీసులు అరెస్టు చేశారని, ఆయనను దర్యాప్తు చేస్తుండగా.. ఘర్షణల సమయంలో విసరడానికి బాటిళ్లు తానే అందించినట్టు అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ ఘటనలో 22 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐపై కాల్పులు జరిపిన నిందితుడినీ పోలీసులు అరెస్టు చేసినట్టు వివరించారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇద్దరు మైనర్లనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో శనివారం రాత్రి చేపట్టిన హనుమాన్ జయంతి శోభాయాత్రలో ఘర్షణలు జరిగాయి. ఓ వర్గం ఈ ర్యాలీపై రాళ్లు రువ్వడంతో ఇది చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి. ఈ వివరాలను పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. ఆయన చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే ఆయనని ఎవరు కాల్చారు ? ఎలా కాల్చారు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలను ఉపయోగించి మరింత మంది అనుమానితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
అల్లర్లు, హత్యాయత్నం, ఆయుధ చట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు.హింసకు సంబంధించిన ప్రాథమిక విచారణ కుట్ర కోణంలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
శనివారం జరిగిన మత ఘర్షణల్లో ఫైరింగ్ జరిపిన వ్యక్తి సోను అనే నిందితుడి భార్యనే పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోగానే.. మహిళలు కొందరు ఇంటిపై కప్పు మీదకు ఎక్కి పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
పోలీసులు నిజానికి సోనూను వెతుక్కుంటూ వారి ఇంటికి చేరుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నార్త్ వెస్ట్ ఢిల్లీ వివరించారు. కానీ, నిందితుడు సోనూ పరారీలో ఉన్నాడు. ఆయనను సెర్చ్ చేస్తూ వెళ్తుండగానే ఆయన కుటుంబ సభ్యులు రెండు రాళ్లను పోలీసులపైకి విసిరారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.
