భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఫిర్యాదు చేయాలంటూ పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ ట్విట్టర్లో పోస్టు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆమెకు ఢిల్లీ పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఫిర్యాదు చేయాలంటూ పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ ట్విట్టర్లో పోస్టు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆమెకు ఢిల్లీ పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే పాక్ నటి ట్వీట్పై ఢిల్లీ పోలీసులు స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు.. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మద్దతుదారులు దేశంలో అల్లర్లు, దహనాలు చేయడంతో పాకిస్థాన్ అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
అదే సమయంలో ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లకు యాక్సెస్ను పరిమితం చేసింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అయితే ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాపై ఫిర్యాదు చేయాలని కోరుతూ ట్విట్టర్లో పోస్టు చేశారు.
‘‘ఢిల్లీ పోలీసుల ఆన్లైన్ లింక్ ఎవరికైనా తెలుసా? నా దేశం పాకిస్తాన్లో గందరగోళం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న భారత ప్రధాని, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW పై నేను ఫిర్యాదు చేయాలి. భారత కోర్టులు స్వేచ్ఛగా ఉంటే (అలాగే వారు క్లెయిమ్ చేస్తారు) అప్పుడు భారత సుప్రీంకోర్టు నాకు న్యాయం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ షిన్వారీ ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే ఈ ట్వీట్ వైరల్గా మారింది.
వైరల్గా మారిన ఈ ట్వీట్కు ఊహించని విధంగా ఢిల్లీ పోలీసులు స్పందించారు. ‘‘పాకిస్తాన్లో మాకు ఇంకా అధికార పరిధి లేదని మేము భయపడుతున్నాము. కానీ.. మీ దేశంలో ఇంటర్నెట్ ఆపివేయబడినప్పుడు మీరు ఎలా ట్వీట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాము!’’ అని ఢిల్లీ పోలీసులు షిన్వారీని ప్రశ్నించారు. పాక్ నటిగా అదిరిపోయే సమాధానం ఇచ్చిన ఢిల్లీ పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘హహా.. నిజంగా చాలా బాగా రోస్ట్ చేశారు. సెహర్ షిన్వారీ, మీకు ఇది చెడ్డ రోజు.. మమ్మల్ని అలరిస్తూ ఉండండి’’ అని నెటిజన్ పేర్కొన్నారు. మరోకరు.. ‘‘పాకిస్తాన్లో అధికార పరిధి కల ఖచ్చితంగా నెరవేరుతుంది!’’ అని కామెంట్ చేశారు.
ఇక, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్మీ స్థావరాలపైకి దూసుకెళ్లడంతో.. పాకిస్తాన్లో రాత్రి సమయంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడం కొనసాగింది. ప్రభుత్వంతో పాటు పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా పీటీఐ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వెలువడుతున్నాయి. రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ జనరల్ హెడ్క్వార్టర్స్ లోపలికి లాఠీలు చేతపట్టిన ప్రదర్శనకారులు చేరుకున్నారని అక్కడి మీడియా సంస్థలు నివేదించాయి. ఇతర వీడియోలలో.. ఇమ్రాన్ మద్దతుదారులు లాహోర్, కరాచీతో సహా వివిధ నగరాల్లోని ఆర్మీ ఆస్తులను ధ్వంసం చేయడం చూడవచ్చు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది.
