పెరోల్పై బయటకు వచ్చి ట్యాక్సీ డ్రైవర్లను అత్యంత కిరాతకంగా చంపి, మొసళ్లకు ఆహారంగా వేసే సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న అత్యంత భయంకరమైన నేరగాడ్ని ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయుర్వేదంలో డిగ్రీ తీసుకున్న నిందితుడు..డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని చంపేసి మొసళ్లకు ఆహారంగా వేసిన అత్యంత క్రూరమైన నేరచరిత్ర ఉండడంతో దేశ వ్యాప్తంగా పోలీసులకు పెద్ద సవాలుగా మారాడు. ఢిల్లీలో తిహాడ్ జైలు నుంచి 2023 ఆగస్టులో పెరోల్పై విడుదలైన అతడు అప్పటి నుంచి కనిపించకుండపోయాడు.
మొసళ్లకు ఆహారంగా..
నిందితుని ఆచూకీ గుర్తించేందుకు క్రైం బ్రాంచ్కు బాధ్యత అప్పగించగా, దాదాపు ఆరు నెలల పాటు వివిధ నగరాల్లో వెదికారు. చివరకు రాజస్థాన్లోని దౌసా ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో, నకిలీ పేరుతో మారువేషంలో ఉన్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.దేవేందర్ శర్మ అత్యంత క్రూరంగా డ్రైవర్లను చంపేసి వారి మృతదేహాలను యూపీలోని కాస్గంజ్ వద్ద ఉన్న మొసళ్లతో నిండిన హజారా కాల్వలో పడేసేవాడని పోలీసులు వెల్లడించారు. ఇతడు ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్లలో జరగిన ఏడుకు పైగా హత్యల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో గుడ్గావ్ కోర్టు అతడికి మరణ శిక్ష కూడా విధించింది.
1990ల మధ్యలో గ్యాస్ డీలర్షిప్ వ్యాపారంలో నష్టపోయిన తర్వాత, దేవేందర్ నకిలీ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసి అక్రమ అవయవాల రాకెట్లోకి అడుగుపెట్టాడు. 1998 నుంచి 2004 వరకు ఆయన 125కి పైగా అక్రమ కిడ్నీ మార్పిడిలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇతడి నేర చరిత్ర కేవలం అవయవాల అక్రమ మార్పిడి వరకే పరిమితమయ్యే లేదు. ట్రక్కులు, ట్యాక్సీలు బుక్ చేసి, డ్రైవర్లను హతమార్చి వారి వాహనాలను అమ్మే వ్యవహారంలోనూ భాగమయ్యాడు.
ట్యాక్సీలను బుక్ చేసి, డ్రైవర్లను చంపి వారి మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా విసిరేవాడు. ఆధారాలు చెరిపేసేందుకు మృతదేహాలను నాశనం చేసేవాడు. ఇతడి సహచరులతో కలిసి వాహనాలను విచ్ఛిన్నం చేసి మార్కెట్లో విక్రయించేవాడు.ఇప్పటికే 2020లోనూ ఇదే తరహాలో పెరోల్పై విడుదలై అదృశ్యమై ఏడునెలల తర్వాత ఢిల్లీలో పట్టుబడ్డాడు. 2023లోనూ మళ్లీ అదే తంతు. పెరోల్పై బయటికి వచ్చి మాయమై, పోలీసులకు తలనొప్పిగా మారాడు. తాజా అరెస్ట్ ద్వారా మరోసారి ఈ నేరగాడి అరాచక చరిత్ర వెలుగులోకి వచ్చింది.