Delhi’s Mundka fire tragedy: ఢిల్లీ అగ్నిప్రమాదం.. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల సాయం
Delhi fire accident: ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్కు సమీపంలోని 3 అంతస్తుల వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది సజీవదహనమయ్యారు. 30 మంది గాయపడ్డారు.
Mundka fire accident: ఢిల్లీలోని ముండ్కాలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం.. ఢిల్లీలో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. "ఢిల్లీలో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వబడుతుంది" అని పిఎంఓ ట్వీట్లో పేర్కొంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై స్పందిస్తూ.. కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. "ఢిల్లీలోని ముండ్కాలో జరిగిన అగ్నిప్రమాదం చాలా బాధాకరం. నేను సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను, పరిపాలన సహాయక చర్యలు మరియు సహాయక చర్యలలో నిమగ్నమై ఉంది. NDRF కూడా త్వరలో అక్కడికి చేరుకుంటుంది. గాయపడ్డ వారిని తరలించడం మరియు వారికి తక్షణ చికిత్స అందించడం మా ప్రాధాన్యత' అని షా ట్వీట్ చేశారు.
పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనం నుంచి 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ముండ్కాలోని వాణిజ్య కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 26 మంది మరణించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రజలు భవనంలోనే చిక్కుకున్నారు. అప్పటికీ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 24 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని... మంటలను ఆర్పాయి.
మంటలు చెలరేగడంతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయ అద్దాలను పగులగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్ కూడా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయి. కిటికీల నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భవనంలోని సీసీటీవీ కెమెరాలు తయారు చేసే అంతస్థులో మంటలు ప్రారంభమయ్యాయి.