Delhi Mundka fire : ఢిల్లీ అగ్నిప్రమాదం పై మెజిస్టీరియల్ విచారణ.. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా
Delhi Mundka fire : పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. మృతుల కటుంబాలకు కేంద్రం రెండు లక్షల చొప్పున.. ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
Mundka fire accident: పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం నుంచి 50 మందికి పైగా రక్షించబడ్డారు. తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించిన ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 27 మందిని పొట్టనబెట్టుకున్న ముండ్కా అగ్నిప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. "ఈ విషాద సంఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.. ఎంతో బాధ కలిగింది. నేను నిరంతరం అధికారులతో టచ్లో ఉన్నాను. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు" అంటూ ట్వీట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఎవరు తప్పుచేసినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మేము సముచితమైన సెక్షన్ల క్రింద FIR నమోదు చేసాము. తప్పు చేసిన లేదా నిబంధనలను పాటించని ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోబడుతుంది. తగు విచారణ జరిపి, బాధ్యులుగా తేలితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని డీసీపీ (ఔటర్ డిస్ట్రిక్ట్) సమీర్ శర్మ తెలిపారు.
ఈ ప్రమాదానికి సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యుత్ పేలుడు కారణంగానే ఈ ఘటన జరిగిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారి తెలిపారు. విద్యుత్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. శిథిలాలలో అనేక కాలిపోయిన అవశేషాలు కనుగొనబడినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. శుక్రవారం ముండ్కాలో మంటలు చెలరేగిన వాణిజ్య భవనంలో చాలా పెద్ద లొసుగులు ఉన్నాయని అతుల్ గార్గ్ తెలిపారు. భవనం ఫైర్ సేప్టీ, NOC లేదని గార్గ్ చెప్పారు. బయటకు వెళ్లేందుకు ఒక్క ద్వారం మాత్రమే ఉందన్నారు. అలాగే, అగ్నిమాపక రక్షణ లేదని పేర్కొన్నారు. అంతేకాదు, ఒకే గదిలో 50-60 మంది ఉన్నారని, గది బయటి నుంచి తాళం వేసి ఉందని తెలిపారు.
కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక శాఖ నుంచి సేఫ్టీ క్లియరెన్స్ లేని ఈ భవనానికి లేదని గుర్తించారు. దీని యజమాని మనీష్ లాక్రాగా గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో ఓ ప్రసంగ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. అందువల్ల అత్యధిక మరణాలు ఈ అంతస్తులోనే జరిగాయని ప్రాథమిక విచారణలో తేలింది.