Delhi liquor policy case: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ మే 28 వరకు న్యాయ‌స్థానం పొడిగించింది. ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసులో ఆయ‌న‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 9న అరెస్టు చేసింది.  

former Delhi deputy chief minister Manish Sisodia: ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. అంత‌కుముందు, ఆర్థిక నేరాల కేసు సాధారణ ప్రజలు, సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలు ఆ నేరంలో సిసోడియా ప్రమేయాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంటూ ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 9న అరెస్టు చేసింది.

అంతకుముందు సిసోడియా తరఫు సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ జివోఎం, క్యాబినెట్ లో ఏం జరిగిందో చెప్పడం ఈడీ పని కాదనీ, ఏదైనా నేరం జరిగితే దాని వల్ల ఎవరు లబ్ది పొందారో చెప్పడమే ఈడీ పని అని వాదించారు. కేవలం ఊహాగానాల ఆధారంగా సిసోడియాను కస్టడీలో ఉంచలేమని న్యాయవాది తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై ఎలాంటి మనీలాండరింగ్ కేసు పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ .. 'మద్యం ముఠాలకు ముడుపులు పొందేందుకు అక్రమ ప్రయోజనాలు కల్పించేందుకు చట్టవిరుద్ధమైన వాతావరణాన్ని సృష్టించారు' అని పేర్కొంది.

ఈ కేసులో కుట్రకు సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాది జోహైబ్ హుస్సేన్ కోర్టుకు నివేదించారు. కుట్ర రహస్యంగా జరుగుతోందని, పబ్లిక్ డొమైన్ లో రూపొందించిన విధానం, నేరాల ఆదాయానికి సంబంధించిన ప్రతి ప్రక్రియ మనీలాండరింగ్ అని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు.

కాగా, ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రుప‌ర్చ‌డానికి తీసుకువ‌చ్చిన క్ర‌మంలో సిసోడియా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పనిని ప్రధాని నరేంద్ర మోడీ ఆపలేరని అన్నారు. కాగా, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్సీటీడీ) ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు సంబంధించిన కేసు దర్యాప్తులో సిసోడియాను సీబీఐ ఇంతకు ముందు అరెస్టు చేసింది. ఈ రెండు కేసుల్లో ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.