Delhi Rains: ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 40 విమానాలు ఆలస్యమయ్యాయి, మూడు రూట్‌లు మారాయి, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Delhi Rains: దేశ వ్యాప్తంగా విస్త‌రంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ ఎడ‌తెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వ‌ల్ల ప‌లు ప్రాంతాలు నీటమునిగాయి. ఢిల్లీ వాసుల‌ జనజీవనం స్థంభించిపోయింది. ఈ క్ర‌మంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఏర్పాటుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ఢిల్లీ మెట్రో సేవ‌ల‌ను నిలిపివేశారు.  మ‌రోవైపు.. విమాన స‌ర్వీసుల‌కు కూడా ఆటంకం క‌లిగింది. 

ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలను దారి మళ్లించారు. అలాగే.. దాదాపు 40 విమానాల టైమింగ్ లో మార్పులు వ‌చ్చాయి. ప్రతికూల వాతావరణం కారణంగా.. కనీసం 25 విమానాలు ఆలస్యం కాగా.. 15 విమానాలు ఆలస్యంగా ల్యాండ్ కానున్నాయి. 

అలాగే ఈ భారీ వర్షాల కారణంగా..  ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే రెండు విమానాలను ఇతర నగరాలకు మళ్లించాల్సి వచ్చిందని, అందులో ఒకటి జైపూర్‌లో, మరొకటి ఇండోర్‌లో ల్యాండ్ అయ్యాయని విస్తారా ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. విస్తారాకు చెందిన రెండు విమానాలతో సహా మ‌రో మూడు విమానాలు ఢిల్లీ విమానాశ్రయానికి బదులు ఇతర నగరాలకు మళ్లించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే.. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మాత్రం ఈ విషయంలో స‌రైన‌ సమాచారం ఇవ్వ‌లేదు. 

మరో ఏడు రోజుల పాటు భారీ వర్షాలు
 
వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. రాబోయే 7 రోజులు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయి. అంతకుముందు ఢిల్లీలో వేడి, తేమ ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ వర్షం ప్రజలకు ఊరటనిచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ ఇప్పటికే ఢిల్లీలో వర్షం పడుతుందని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. డిపార్ట్‌మెంట్ ప్రకారం.. రాబోయే 7 రోజుల పాటు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

వాతావరణ శాఖ ప్రకారం.. బుధవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 గా న‌మోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్ర‌త‌  28 డిగ్రీలుగా న‌మోద‌ని తెలిపింది. జూలై 21 నుండి 23 వరకు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ,. ఆ తర్వాత జూలై 23 నుంచి 25 వరకు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని. ఆ తర్వాత జూలై 26 నుంచి 28 వరకు రాజధానిలో రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని వాతావార‌ణ శాఖ తెలిపింది.