దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో అతలాకుతలమైన నగరాల్లో ముంబై తర్వాతి స్థానం ఢిల్లీదే. కేసులు, మరణాల్లో ఈ రెండు నగరాలు పోటీ పడ్డాయి. రోడ్లపై అంబులెన్స్‌ల పరుగులు, ఆసుపత్రుల ఎదుట రోగుల క్యూలు, ఆగకుండా మండిన దహన వాటికలు. గడిచిన రెండు నెలలుగా ఇవే దృశ్యాలు దేశ వాసుల కళ్లెదుట కనిపించాయి

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో అతలాకుతలమైన నగరాల్లో ముంబై తర్వాతి స్థానం ఢిల్లీదే. కేసులు, మరణాల్లో ఈ రెండు నగరాలు పోటీ పడ్డాయి. రోడ్లపై అంబులెన్స్‌ల పరుగులు, ఆసుపత్రుల ఎదుట రోగుల క్యూలు, ఆగకుండా మండిన దహన వాటికలు. గడిచిన రెండు నెలలుగా ఇవే దృశ్యాలు దేశ వాసుల కళ్లెదుట కనిపించాయి. ఇప్పుడిప్పుడే వైరస్ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ హెచ్చరికలతో మరోసారి ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఈ కష్ట కాలంలో వైద్యులకు సహాయపడేందుకు వీలుగా 5000 మంది యువకులకు హెల్త్‌ అసిస్టెంట్లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ప్రకటించారు. కరోనా రెండు దశల్లోనూ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బంది కొరత కనబడిందని, అందువల్ల వైద్యులు/ నర్సులకు సహాయపడేందుకు 5వేల మంది అసిస్టెంట్లను సిద్ధంగా వుంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేజ్రీవాల్ వివరించారు. వీరందరికీ ఢిల్లీలోని తొమ్మిది ప్రముఖ వైద్య సంస్థల్లో రెండు వారాల పాటు శిక్షణ ఇస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Also Read:కరోనా తగ్గుముఖం : సోమవారం నుంచి ఢిల్లీలో అన్‌లాక్ .. ముందుగా వాటికే ప్రాధాన్యత

వీరందరికీ నర్సింగ్‌, పారామెడికల్‌‌, లైఫ్‌ సేవింగ్‌పై శిక్షణ కల్పిస్తామని ఆసక్తి ఉన్నవారు ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఎం సూచించారు. జూన్‌ 28 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని కేజ్రీవాల్ తెలిపారు. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో పాటు 18 ఏళ్లు నిండిన వారు అర్హులని.. ఆసక్తి వున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని, పనిచేసిన రోజులను బట్టి వేతనం చెల్లింపు ఉంటుందని వెల్లడించారు.