Delhi fire accident: ఢిల్లీలోని ముండ్కాలోని ఓ కార్యాలయ భవనంలో శుక్రవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది చనిపోయారు.
Massive Fire At 3-Storey Building In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 27 మంది ప్రణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.."ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఎంతగానో బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుని తెలుసుకున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్కు సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. "ఈ విషాద సంఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.. ఎంతో బాధ కలిగింది. నేను నిరంతరం అధికారులతో టచ్లో ఉన్నాను. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు" అంటూ ట్వీట్ చేశారు.
పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనం నుంచి 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ముండ్కాలోని వాణిజ్య కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 27 మంది మరణించారు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రజలు భవనంలోనే చిక్కుకున్నారు.