మనది తాలిబాన్ రాజ్యం కాదు: ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుంటూ మతపరమైన నినాదాలిచ్చి, యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఓ నిందితుడికి ముందస్తు బెయిల్ను తిరస్కరిస్తూ ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బహుళ సంప్రదాయాలు, విభిన్న సాంస్కృతిక ప్రజలు కలిసి నివసించే మనదేశంలో రూల్ ఆఫ్ లా కీలకమని, ఇది తాలిబాన్ రాజ్యం కాదని పేర్కొంటూ బెయిల్ మంజూరును నిరాకరించింది. ఇలాంటి రెచ్చగొట్టే నినాదాల ఘటనలే కొన్నిసార్లు అల్లర్లకు కారకాలుగా పనిచేసిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని పేర్కొంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు ఓ కేసులో నిందితుడికి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది తాలిబాన్ రాజ్యం కాదని, బహుళ, భిన్న సాంస్కృతిక ప్రజలు నివసించే మనదేశంలో చట్టబద్ధ పాలన అతి ముఖ్యమైనదని పేర్కొంది. జంతర్ మంతర్ దగ్గర ఈ నె 8న మతపరమైన నినాదాలు ఇస్తూ యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు అయిన ఓ గ్రూపు అధ్యక్షుడికి ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
మతపరమైన నినాదాలు రెచ్చగొట్టిన ఘటనలు, అవి అల్లర్లకు దారితీసిన ఘటనలు చరిత్రలో మనకు కోకొల్లలు కనిపిస్తున్నాయని, అందుకే, రెచ్చగొట్టే నినాదాలిచ్చినట్టు ప్రాథమికంగా తెలియవస్తున్న నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదని అదనపు సెషన్స్ జడ్జీ అనిల్ అంతిల్ పేర్కొన్నారు. దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహించుకుంటుండగా కొందరు మెదళ్లు ఇంకా అసమ్మతి, తామే ఉత్కృష్టులమనే భావనలతోనే నిండి ఉన్నదని వ్యాఖ్యానించారు.
భావప్రకటన స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కేనని, కానీ, అది సంపూర్ణమైంది కాదని న్యాయమూర్తి తెలిపారు. ఇతరుల ప్రాథమిక హక్కులను భంగం కలిగించనంత వరకు భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డు లేదని వివరించారు. లేదా సమాజంలో సోదరభావాన్ని, సౌభ్రతృత్వాన్ని, శాంతి భద్రతలను, అలౌకిక భావనను భంగం కలిగించనంత వరకు ఆ స్వేచ్ఛకు సంకెళ్లు లేవని తెలిపారు. అంతేకానీ, ఉదారవాద భావజాలంతో భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా రాజ్యాంగ మూలసూత్రాలనే సవాలు చేసే చర్యలను ఆమోదించబోమని స్పష్టం చేశారు.