ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియా కస్టడీ గడువు పొడిగింపు, ఎప్పటి వరకంటే..?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని ఏప్రిల్ 5 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన కస్టడీ గడువు ఇవాళ్టీతో ముగియనుండటంతో ఆయనను ఈడీ అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
కాగా.. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్సీటీడీ) ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిసోడియాను సీబీఐ రిమాండ్ కు పంపిన రౌస్ అవెన్యూ కోర్టు.. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీటీవీ కవరేజ్ ఉన్న చోట నిందితుల విచారణ జరగాలని, ఆ ఫుటేజీని సీబీఐ భద్రపరచాలని ఆదేశించింది.
ALso REad: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ 24కి వాయిదా
నిందితుడు గతంలో రెండుసార్లు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నాడని, అయితే విచారణలో అడిగిన చాలా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడంలో అతడు విఫలమయ్యాడని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో అతడిపై వచ్చిన నేరారోపణ సాక్ష్యాలను న్యాయబద్ధంగా వివరించడంలో విఫలమయ్యాడని ట్రయల్ కోర్టు పేర్కొంది. తరువాత రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.
ఇదిలావుండగా.. లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు సిసోడియా తరచూ ఫోన్లు మార్చారని న్యాయస్థానానికి తెలిపింది సీబీఐ. ఇది ఆయన అమాయకత్వం కాదని స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టులో మంగళవారం లిక్కర్ స్కాంపై విచారణ జరిగింది. ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఇంకా 60 రోజుల సమయం వుందని.. అప్పటి వరకు సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఙప్తి చేసింది సీబీఐ. ఆయన బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం వుందని, ఢిల్లీ కోర్టుకు తెలిపింది సీబీఐ. అనంతరం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది కోర్ట్.