ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ 24కి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం ఈ నెల 24కి వాయిదా వేసింది. లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు సిసోడియా తరచూ ఫోన్లు మార్చారని న్యాయస్థానానికి తెలిపింది సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు సిసోడియా తరచూ ఫోన్లు మార్చారని న్యాయస్థానానికి తెలిపింది సీబీఐ. ఇది ఆయన అమాయకత్వం కాదని స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టులో మంగళవారం లిక్కర్ స్కాంపై విచారణ జరిగింది. ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఇంకా 60 రోజుల సమయం వుందని.. అప్పటి వరకు సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఙప్తి చేసింది సీబీఐ. ఆయన బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం వుందని, ఢిల్లీ కోర్టుకు తెలిపింది సీబీఐ. అనంతరం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది కోర్ట్.
కాగా.. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని 2023 ఏప్రిల్ 3 వరకు పొడిగించారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగింది. ఇప్పటికే అన్ని రికవరీలు పూర్తయినందున తనను కస్టడీలో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో సిసోడియా పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎప్పుడు పిలిస్తే అప్పుడు తాను దర్యాప్తులో పాల్గొన్నానని సిసోడియా పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరైందని తెలిపారు. తాను ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ముఖ్యమైన రాజ్యాంగ పదవిలో ఉన్నానని, సమాజంలో లోతైన మూలాలు ఉన్నాయని సిసోడియా పేర్కొన్నారు.
Also REad: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు.. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్సీటీడీ) ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిసోడియాను సీబీఐ రిమాండ్ కు పంపిన రౌస్ అవెన్యూ కోర్టు.. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీటీవీ కవరేజ్ ఉన్న చోట నిందితుల విచారణ జరగాలని, ఆ ఫుటేజీని సీబీఐ భద్రపరచాలని ఆదేశించింది. నిందితుడు గతంలో రెండుసార్లు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నాడని, అయితే విచారణలో అడిగిన చాలా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడంలో అతడు విఫలమయ్యాడని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో అతడిపై వచ్చిన నేరారోపణ సాక్ష్యాలను న్యాయబద్ధంగా వివరించడంలో విఫలమయ్యాడని ట్రయల్ కోర్టు పేర్కొంది. తరువాత రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.