కేజ్రీవాల్ హత్యకు కుట్ర.. : బీజేపీపై మనీష్ సిసోడియా ఆరోపణలు.. ఓటమి భయంతోనంటూ ఫైర్
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్రపన్నుతున్నారని ఆమ్ ఆద్మీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. సీఎం కేజ్రీవాల్పై దాడి చేయాలని బీజేపీ ఢిల్లీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ తన గూండాలను బహిరంగంగా అడుగుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.
Delhi Deputy CM Manish Sisodia: ఆమ్ ఆద్మీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్ర పన్నుతున్నదని ఆప్ ఆరోపించింది. రాబోయే ఢిల్లీ మున్సిపల్ బాడీ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను చంపడానికి బీజేపీ కుట్రకు తెరలేపిందని ఆప్ ఆరోపించింది. బీజేపీ ఢిల్లీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు మనోజ్ తివారీ తన గూండాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేయాలని బహిరంగంగా అడుగుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అయితే, సిసోడియా వాదనలను బీజేపీ ఖండించింది. ఆప్ పూర్తిగా విసుగు చెందిందనీ, ప్రజల సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తోందని పేర్కొంది.
అయితే, ఆప్-బీజేపీల మధ్య ఈ వాదనలకు తెరలేపింది బీజేపీ నాయకుడు చేసిన ఒక ట్వీట్. బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ఆప్, కేజ్రీవాల్ గురించి ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ పై స్పందించిన మనీష్ సిసోడియా.. అరవింద్ కేజ్రీవాల్ ను చంపడానికి ప్లాన్ ను అమలు చేయడానికి బీజేపీ విధివిధానాలను రూపొందించి, ఖరారు చేసిందని ఆరోపించారు. వారి చిల్లర రాజకీయాలకు భయపడేది లేదని పేర్కొన్నారు. సిసోడియా తన ట్వీట్ లో "సీఎం అరవింద్ కేజ్రీవాల్పై దాడి చేయాలని బీజేపీ ఢిల్లీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ తన గూండాలను బహిరంగంగా అడుగుతున్నారు. గుజరాత్, ఎంసీడీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ భయాందోళనకు గురైంది. @అరవింద్ కేజ్రీవాల్ హత్యకు పథకం పన్నారు. వారి ఎంపీ మనోజ్ తివారీ తన గూండాలను అరవింద్ జీపై దాడి చేయమని బహిరంగంగా అడుగుతున్నాడు. దాని కోసం పూర్తి ప్రణాళికను సిద్ధం చేశాడు. వారి చిల్లర రాజకీయాలకు ఆప్ భయపడదని, ఇప్పుడు వారి గూండాయిజానికి ప్రజలే సమాధానం చెబుతారని" పేర్కొన్నారు.
మరోవైపు, సిసోడియా వాదనలను బీజేపీ తిప్పికొట్టింది. పూర్తిగి విసిగిపోయిన ఆప్.. ప్రజల సానుభూతి పొందడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. అయితే, అంతకుముందు మనోజ్ తివారి చేసిన ట్వీట్ ఈ వివాదానికి కారణమైంది. మనోజ్ తివారీ తన ట్వీట్ లో.. "అరవింద్ కేజ్రీవాల్ జీ భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే నిరంతర అవినీతి, టిక్కెట్ల అమ్మకం, జైలులో రేపిస్ట్- మసాజ్ ఎపిసోడ్తో స్నేహం కారణంగా ఆప్ కార్యకర్తలు, ప్రజలు కోపంగా ఉన్నారు. వారి ఎమ్మెల్యేను కూడా కొట్టారు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఢిల్లీ సీఎంకు జరగకూడదు.. శిక్ష మాత్రం న్యాయస్థానమే ఇవ్వాలి" అని పేర్కొన్నారు.