గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి.. గ్రామస్తులను తల్వార్తో బెదిరించిన అభ్యర్థి
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థి గ్రామస్తులను బెదిరించిన ఘటన చోటుచేసుకుంది. కత్తి తీసి ఊరిలో తిరుగుతూ బెదిరించాడు. గ్రామస్తులను దూషించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతనిపై కేసు నమోదైంది.
ముంబయి: మహారాష్ట్ర అకోలా జిల్లాలో కలకలం రేపే ఘటన ఒకటి జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఆ అభ్యర్థి తల్వార్ తీసుకుని గ్రామస్తులను అందరినీ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారికి అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
అకోలా జిల్లా పాతూర్ తాలూకాలోని ఖాంఖేడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 45 ఏళ్ల వ్యక్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే, ఆయన గెలువలేదు. ఓటమి పాలయ్యాడని అధికారులు తెలిపారు. పరాజయం పాలవ్వడంపై అప్సెట్ అయిన ఆ వ్యక్తి గ్రామంలో కలియతిరుగుతూ కత్తిని బయటకు తీసి గ్రామస్తులను బెదిరించాడు. ప్రజలను దూషించాడని ఓ అధికారి వివరించాడు.
అయితే, నిందితుడు కుటుంబమే గత 30 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నదని ఆ అధికారి తెలిపాడు. ఈ సారి మాత్రం ఆ కుటుంబానికి ఊహించని విధంగా షాక్ తగిలింది. దీంతో అతను అసంతృప్తికి లోనై ప్రజలపైనే కత్తి చూపుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు.