Andhra Rains: అండమాన్స్ వద్ద కొనసాగుతున్న తీవ్రవాయుగుండం తుపానుగా బలపడే అవకాశం లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఉత్తర దిశగా మయన్మార్ వేపు పయనిస్తూ బలహీనపడి నేటి మధ్యాహ్నానికి మయన్మార్ తీరం దాటుతుందని అంచనా. రాయలసీమ, కోస్తాంధ్రలలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు
Andhra Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. సోమవారానికి మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారింది. దీని ప్రభావం మరింత పెరగవచ్చని..వాయుగుండం కాస్తా.. తుపానుగా మారొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. మరో ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే.. . సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో 65.5 మి.మీ., విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 38.75 మి.మీ., ప్రకాశం జిల్లా కనిగిరిలో 37 మి.మీ., తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 35 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం, అసని తుపాను ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చని తెలిపారు.
12 గంటల్లో అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. ఈ తుపాను బుధవారం మయన్మార్లోని తాండ్వే సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. సోమవారం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. విజయనగరం, ప్రకాశం, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
ఈదురుగాలులతో వడగళ్లు పడ్డాయి. తోటలు, పంటపొలాలు దెబ్బతిన్నాయి. రోడ్ల పక్కన భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. విద్యుత్తు తీగలపై చెట్లకొమ్మలు విరిగిపడటంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే, పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి.
