జూలై 31 లోపుగా 12వ తరగతి ఫలితాలు విడుల చేయాలి: సుప్రీంకోర్టు
ఈ ఏడాది జూలై 31 లోపుగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 31 లోపుగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్ మార్కులు అసెస్మెంట్ ను పూర్తి చేసి జూలై 31 లోపుగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది.ఒకే రకమైన మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పది రోజుల్లో బోర్డులన్నీ మూల్యాంకన విధానాన్ని రూపొందించి అందించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. బోర్డులు తమ స్వంత మూల్యాంకన విధానాలను రూపొందించుకొనే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి వచ్చే నెల 31 లోపుగా ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులకు కూడ సుప్రీంకోర్టు ఇదే రకమైన ఉత్తర్వులను ఇదివరకు జారీ చేసింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని దేశంలోని 21 రాష్ట్రాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఆరు రాష్ట్రాలే పరీక్షలను నిర్వహించాయి.