మహారాష్ట్ర: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 23కి చేరిన మృతుల సంఖ్య.. మోడీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందిన వారికి ప్రధాని మోడీ నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 23కి పెరిగింది.
మహారాష్ట్రలోని చెంబూరు, విఖ్రోలిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరుకుంది. చెంబూరులో జరిగిన ఘటనలో 17 మంది మృతి చెందగా.. విఖ్రోలిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోడీ ట్వీట్ చేశారు. మరోవైపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా మృతులకు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read:మహారాష్ట్రలో ఘోరం: కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి
కాగా, 17వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కొండచరియలు విరిగిపడటంతో గోడలు కూలాయని ఎన్డీఆర్ఎఫ్ బృందం పేర్కొంది. ఇప్పటికే సహాయక బృందాలు గోడ కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. చెంబూరులో ఒంటిగంట సమయంలో, విఖ్రోలిలో అర్ధరాత్రి 2.30 సమయంలో గోడలు కూలాయి. మరోవైపు ముంబయి నగరాన్ని భారీ వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోరివాలిలో పార్కింగ్ చేసిన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. చాలాచోట్ల పట్టాలపై నీరు నిలవడంతో సెంట్రల్, వెస్టర్న్ రైల్వే జోన్లు సర్వీసులను నిలిపివేశాయి.