పేర్లు, వయసులు ఒకే తీరులో ఉండటంతో మారిన డెడ్ బాడీలు.. కుటుంబాలు ఎలా గుర్తుపట్టాయంటే?
ముంబయిలో ఓ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. హాస్పిటల్లో పేర్లు, వయసులు దాదాపు ఒకే రీతిలో ఉన్న రెండు మృతదేహాలను వేర్వేరు కుటుంబాలు తీసుకెళ్లాయి. అంత్యక్రియలకు ముందు డెడ్ బాడీ మీసం వేరుగా ఉన్నాయని గుర్తించి తిరిగి హాస్పిటల్కు తెచ్చారు. అప్పుడు ఆ మృతదేహాలను మార్చి ఇచ్చారు.
ముంబయి: పేర్లు ఒకే రీతిలో.. వయసులు దగ్గర దగ్గరిగానే ఉండటంతో రెండు డెడ్ బాడీలు తారుమారయ్యాయి. ఆ కుటుంబాలు ఇతరుల మృతదేహాలను తీసుకెళ్లాయి. తీరా అంత్యక్రియలు జరుపుతుండగా అసలు విషయం బయట పడింది. చాలా మందికి అంత్యక్రియలు జరుపుతున్న డెడ్ బాడీ తమ బంధువుది కాదనే అనుమానాలు వచ్చాయి. చివరకు ఆ డెడ్ బాడీలకు ఉన్న మీసాలే ఈ గందరగోళం నుంచి బయటపడేశాయి. ఆ మీసాల ఆధారంగానే తాము తీసుకువచ్చిన మృతదేహం తమ బంధువుది కాదని వారు స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయిగడ్లో చోటుచేసుకుంది.
అలీబాగం తెహసిల్లో పెజారీ గ్రామానికి చెందిన రమాకాంత్ పాటిల్ (62)ల బీపీ, డయాబెటీస్ కారణంగా ఎంజీఎం హాస్పిటల్లో మరణించాడు. కాగా, పన్వెల్ తెహసిల్ దహివలి గ్రామానికి చెందిన రామ్ పాటిల్ (66) కిడ్నీ, లివర్ సమస్యలతో అదే హాస్పిటల్లో మరణించాడు.
వారి డెడ్ బాడీలను కుటుంబాలు వచ్చి తీసుకెళ్లాయి. రమాకాంత్ పాటిల్ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి కొద్ది ముందు ఆ డెడ్ బాడీకి ఉన్న మీసం వేరే షేప్లో ఉన్నదని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వారు హాస్పిటల్ను కాంటాక్ట్ అయ్యారు. కానీ, మృతదేహాలు అప్పగించడంలో ఎలాంటి పొరపాటు జరగలేదని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.
రామ్ పాటిల్ కుటుంబం కూడా ఈ విషయాన్ని గుర్తించారు. ఈ రెండు డెడ్ బాడీలను సంబంధిత కుటుంబాలు ఎంజీఎం హాస్పిటల్కు తీసుకువచ్చాయి. ఎంజీఎం హాస్పిటల్ సిబ్బంది ఆ మృతదేహాలను మార్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదిలా ఉండగా, హాస్పిటల్ సిబ్బంది మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మృతదేహాలను తీసుకెళ్లుతుండగా బంధువులు చూసే స్వీకరించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.