దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్.. ఆ బాధ్యతల నుండి తొలగింపు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని పార్టీ అధిష్టానం గట్టిషాక్ ఇచ్చింది. ఆమెను ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్చార్జిగా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఒడిశా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుండి తప్పించగా.. తాజాగా ఛత్తీస్ గఢ్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ.. బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో రాజస్థాన్ కు చెందిన ఓం ప్రకాశ్ మాథూర్ను ఛత్తీస్గఢ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమిస్తూ శుక్రవారం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన అనంతరం హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
2020 నవంబర్ నుంచి దగ్గుపాటి పురందేశ్వరి ఛత్తీస్గఢ్, ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్నారు. కానీ, ఆమె అంచనాలకు తగ్గట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయలేకపోయారనే బాధ్యత నుంచి తప్పించినట్టు తెలుస్తుంది. ఆమెకు తొలుత కీలక బాధ్యతలు అప్పగించడంతో బీజేపీ మరో ప్రయోజనం ఆశించినట్టు తెలుస్తోంది. ఆమె ఎన్టీఆర్ కుమార్తె కావడంతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడుతుందనీ, టీడీపీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని భావించినట్టు తెలుస్తోంది. అయితే.. అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడం కూడా ఆమె తొలగింపునకు కారణం కావచ్చని రాజకీయ పెద్దలు భావిస్తున్నారు.
యూపీ ఎన్నిక విజయంలో కీలక పాత్ర
ఛత్తీస్గఢ్లో పురందేశ్వరి స్థానంలో ప్రధాని మోడీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైన ఓం మాథుర్ గతంలో గుజరాత్ ఇన్ చార్జ్ గా, గతేడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్ చార్జ్ గా వ్యవహరించారు. బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని బీజేపీ క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ నేపథ్యంతోనే 15 రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ల మార్పులకు శ్రీకారం చుట్టింది.