ప్రముఖ వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (54)  కన్నుమూశారు. ముంబైలోని పాల్ఘర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఈ బిజినెస్‌ టైకూన్‌ మృత్యువాత పడ్డారు. ఆయన సంపద ఎంతో తెలుసా? 

ప్రముఖ వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయ‌న అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా పాల్ఘర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. సైరన్ ప్రయాణిస్తున్న కారు పాల్గర్ సమీపంలోని చరోటి దగ్గర అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆయన తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆస్పత్రికి తరలించే క్ర‌మంలో ఆయ‌న‌ తుది శ్వాస వ‌దిలాడు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్ర‌యాణిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సైరస్ తో పాటు మరొకరు ఈ ప్రమాదంలో మ‌ర‌ణించ‌గా.. మరో ఇద్దరికీ గాయలైనట్లు సమాచారం.  

అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎంత సంపాదించారు. ఆయ‌న ఆస్తిపాస్తులెంతా..? అనే ప‌లు ప్ర‌శ్న‌లు త‌లెత్తున్నాయి.  ఒక్క‌సారి సైరస్ మిస్త్రీ గురించి తెలుసుకుందాం..  వ్యాపార దిగ్గజం షాపూర్‌జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ. ఐర్లాండ్‌లో జన్మించిన  సైరస్ మిస్త్రీ లండన్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు. లండన్ యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. 1994లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో.. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో విస్తరించి ఉంది. తన తండ్రి తప్పుకోవడంతో ఆయ‌న‌ 2006లో టాటాసన్స్‌ బోర్డులో చేరారు.

రతన్ టాటాతో ప్రత్యేక సంబంధాలు

సైరస్ మిస్త్రీ 2012లో టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ త‌రువాత టాటా ఎలెక్సీలో డైరెక్టర్‌గా పనిచేశారు. కొన్నాళ్లు టాటా పవర్‌ డైరెక్టర్‌గా కూడా సేవ‌లందించారు. నవంబర్ 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.  డిసెంబర్, 2012లో టాటా సన్స్  ఛైర్మన్‌గా రతన్‌ టాటా బాధ్యతల నుంచి తప్పుకోవ‌డంతో అత‌ని స్థానంలో సైరస్‌ మిస్త్రీకి టాటా గ్రూప్‌కు సారథ్యం వహించే అవకాశం వ‌చ్చింది. అప్పటికి 43 ఏళ్ల సైరస్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

టాటా సన్స్ హోల్డింగ్స్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్​కు 18 శాతం వాటా ఉంది. కానీ, ప‌లు కార‌ణాల‌తో  2016లో మిస్త్రీని అకస్మాత్తుగా చైర్మన్ పదవి నుంచి తప్పించారు. త‌న తొలగింపును సవాలు చేస్తూ.. సైరస్‌ మిస్త్రీ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్​ (ఎన్‌సీఎల్‌టీ) ను ఆశ్ర‌యించారు. సుధీర్ఘ విచార‌ణ అనంత‌రం  టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల‌ను జారీ చేసింది. కానీ సుప్రీం కోర్టు ఆ ఆదేశాల‌ను  2021 మార్చి 26న ప‌క్క‌న పెట్టింది. 
 
వివిధ మీడియా నివేదికల ప్రకారం..టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ వ్యాపారం చాలా దేశాల్లో విస్తరించింది. మిస్త్రీ వ్యాపారం భారత్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. టాటా సన్స్‌లో మిస్త్రీకి 18.4 శాతం వాటా ఉంది. సైరస్ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటా సన్స్ గ్రూప్‌కు చైర్మన్‌గా ఉన్నారు. అతని నికర ఆస్తి విలువ సుమారు $10 బిలియన్లు అని తాజా నివేదికలు తెలుపుతున్నాయి.