సైరస్ మిస్త్రీ మృతి కేసులో మరో కీలక విషయం వెలుగులోకి.. ఆమె సీటు బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడం వల్లే..
ప్రముఖ పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ మృతికి సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న డాక్టర్ అనహిత పండోల్ సరిగా సీటు బెల్ట్ ధరించలేదనీ, అందుకే ఆమెకు ఎక్కువ గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైరస్ మిస్త్రీ మృతికి సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న డాక్టర్ అనహిత పండోల్ సరిగా సీటు బెల్ట్ ధరించలేదనీ, అందుకే ఆమెకు ఎక్కువ గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. సెప్టెంబరు 4న సైరస్ మిస్త్రీ అతని స్నేహితుడు జహంగీర్, డాక్టర్ అనహిత పండోల్ , ఆమె భర్త డారియస్ పండోల్ అందరూ కలిసి మెర్సిడెస్ బెంజ్ కారు లో గుజరాత్లోని ఉద్వాడ నుంచి ముంబైకి తిరిగి వస్తున్నారు.
ప్రమాదానికి ఐదు సెకన్ల ముందు వరకు సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించిందనీ, ఢీకొనడానికి కొన్ని సెకన్ల ముందు డాక్టర్ అనాహిత పండోల్ బ్రేకులు వేశారనీ, దాని కారణంగా దాని వేగం 89 కి.మీ.కి తగ్గిందని తెలుస్తోంది. అయితే.. అకస్మాత్తుగా బ్రేక్లు వేయడంతో సీటు బెల్ట్ లేకుండా వెనుక సీట్లలో కూర్చున్న మిస్త్రీ, జహంగీర్లకు ముందు సీట్ల వెనుక భాగంలో బలంగా ఢీ ఢీకొనడంతో టాటా సన్స్ మాజీ చైర్మన్ మిస్త్రీ (54), అతని స్నేహితుడు జహంగీర్ పండోల్ మరణించారు.ఈ ప్రమాదంలో డాక్టర్ అనహిత పండోల్ , ఆమె భర్త డారియస్ పండోల్ కూడా తీవ్ర గాయాలయ్యాయి.
అనహిత సరిగా సీట్ బెల్ట్ ధరించలేదు
ఈ కేసు విచారణలో భాగంగా పాల్ఘర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాలాసాహెబ్ పాటిల్ మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో మెర్సిడెస్ బెంజ్ కారును నడుపుతున్న డాక్టర్ అనహిత సీటు బెల్ట్ సరిగా ధరించలేదని చెప్పారు. అనాహిత భుజానికి పట్టీ మాత్రమే ధరించిందనీ, ల్యాప్ బెల్ట్ సర్దుబాటు చేయలేదని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెర్సిడెస్ బెంజ్ కారులో లేదా ఏదైనా కొత్త ఎలక్ట్రానిక్ కారులో అలారం అమర్చబడి ఉంటుంది. మీరు బెల్ట్ సరిగ్గా ధరించకపోతే.. ఆ అలారం మోగుతుంది. కానీ అనాహిత ఇక్కడ తప్పు చేసింది. అలారం స్విచ్ ఆఫ్ చేయడానికి ల్యాప్ బెల్ట్ని ఉపయోగించింది. దీంతో అలారం మోగకుండా చేసింది. ఇప్పుడు పోలీసులు ఈ నిర్లక్ష్యాన్ని కూడా ఛార్జ్ షీట్ లో నమోదు చేయనున్నారు.
డాక్టర్ అనహితపై పలు సెక్షన్లలో కేసు నమోదు
ప్రమాదం నుంచి బయటపడిన డాక్టర్ అనహిత దక్షిణ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పాల్ఘర్ పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 304(A),279,337 కింద కేసు నమోదు చేశారు.
అనహిత పండోలె ఎవరు?
ప్రమాదం జరిగిన సమయంలో సైరస్ మిస్త్రీతో కలిసి తన కారులో ప్రయాణించింది. ఆమెనే ఆ కారును నడిపింది. అనహిత ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. దీనితో పాటు.. ఆమె ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో కూడా పనిచేస్తుంది. ఆమెకు గైనకాలజిస్ట్గా 18 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. అనహిత పండోల్ TNMC & BYL నాయర్ హాస్పిటల్ నుండి MBBS, MD పూర్తి చేసింది. ఇది కాకుండా.. డాక్టర్ పండోల్ జియో పార్సీ ప్రోగ్రామ్, పార్సీ పంచాయితీతో అనుబంధం ఉంది. ఆమె భర్త పేరు డారియస్ పండోల్.. అతను JM ఫైనాన్షియల్ సీఈఓ(CEO).
ప్రమాదం ఎలా జరిగింది?
ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని కాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నది వంతెనపై చరోతి నాకా వద్ద మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. గైనకాలజిస్ట్ అనహిత పండోలే కారు నడుపుతున్నారు. డివైడర్ను ఢీకొనడంతో మిస్త్రీ కారు రిటెన్షన్ వాల్ను ఢీకొట్టింది. మిస్త్రీతో పాటు.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో జహంగీర్ పండోల్ కూడా ఉన్నాడు. అతను డారియస్ సోదరుడు. ముంబైలోని జేజే ఆస్పత్రిలో ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
రతన్ టాటా వారసుడిగా సైరస్ మిస్త్రీ
2011లో రతన్ టాటా వారసుడిగా మిస్త్రీ ఎంపికయ్యారు. అంతకుముందు కూడా అతను ప్రముఖ వ్యాపార సమ్మేళనం షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నాడు. 1968 జూలై 4న ముంబైలో జన్మించిన సైరస్ తండ్రి పల్లోంజీ మిస్త్రీ కూడా పెద్ద వ్యాపారవేత్త.